
మలేషియా జైలు నుంచి స్వగ్రామానికి..
● కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో ఇంటికి చేరిన ముగ్గురు బాధితులు
కడెం: ఉన్న ఊళ్లో ఉపాధి లేక.. కుటుంబ పోషణకోసం పొట్టచేత పట్టుకుని కుటుంబ సభ్యులను వదిలి ఉపాధికోసం దేశం కాని దేశం వెళ్లి నరకయాతన అనుభవించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండల వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్ 2023 జనవరిలో, అదే గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్ మార్చిలో, మున్యాల్కు చెందిన యమునూరి రవీందర్ జూన్లో ఉపాధి నిమిత్తం మలేషియా దేశానికి వెళ్లి 17 నెలల క్రితం జైలు పాలయ్యారు.
జైల్లో నరకయాతన..
మలేషియాలో ఉపాధి కల్పిస్తానని ఓ ఏజెంట్ ఈ ముగ్గురికి ఆశ చూపాడు. రూ.60 వేలు కడితే అక్కడ రూ.30 వేల జీతం వస్తుందని చెప్పడంతో విజిట్ వీసాపై మలేషియా వెళ్లారు. అక్కడ అల్యూమినియం కంపనీలో లేబర్ పనులు చూపించాడు. కొద్ది నెలలు బాగానే ఉన్నా ఆతర్వాత పనుల్లేక పస్తులున్నారు. ఉపాధికోసం తిరుగుతున్న క్రమంలో అక్కడి పోలీసులకు చిక్కడంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విజిట్ వీసాపై వెళ్లినవారు అక్కడి నిబంధనల ప్రకారం పర్మినెంట్ చేసుకోవాలంటే రూ.2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. చేసేదేంలేక రూ.2 లక్షలు కట్టి పర్మినెంట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం నిబంధనలు సవరించడంతో 2023 తర్వాత వచ్చిన వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం చేజారింది. దీంతో ముగ్గురు 7 నెలల 17 రోజుల పాటు జైల్లో మగ్గారు.
కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో..
తమవారు జైలులో బంధీలుగా ఉన్నారని, ఎలాగైనా వారిని ఇంటికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ను వేడుకున్నారు. స్పందించిన ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సలహా మేరకు మూడుసార్లు మలేషియా వెళ్లి అక్కడి జైలు అధికారులతో మాట్లాడారు. ఇద్దరు న్యాయవాదులను ఏర్పాటు చేసి సదరు వ్యక్తులను జైలునుంచి విడిపించారు. బయటకు వచ్చిన వారికి తమ సొంత ఖర్చులతో విమాన టికెట్ ఇప్పించడంతో ఈనెల 10న స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి తిరిగి వస్తామని కలలో కూడ అనుకోని వారు కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో ఇంటికి చేరుకున్నారు. తమ వారిని ఇంటికి చేర్చిన జాన్సన్నాయక్ను సోమవారం బాధిత కుటుంబ సభ్యులు ఖానాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఽకృతజ్ఞతలు తెలిపారు.
ఇంటికి వస్తామనుకోలే
జైలు నుంచి మమ్మల్ని విడిపించి ఇంటికి రప్పించిన కే టీఆర్, జాన్సన్నాయక్కు జీవితాంతం రుణపడి ఉంటాం. జైల్లో ఉన్న మేము ఇంటికి వస్తామని కలలో కూడా అనుకోలేదు. జాన్సన్ అన్న మూడుసా ర్లు వచ్చారు. విడిపిస్తానని భరోసానిచ్చారు.
– రాచకొండ నరేశ్, లింగాపూర్
నరకయాతన అనుభవించాం
విజిట్ వీసా మీద మలేషియాకు వెళ్లిన మమ్మల్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఏడు నెలల 17 రోజులపాటు జైలులో నరకయాతన అనుభవించాం. జైలులో కడుపునిండా తిండి పెట్టకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాం.
– యమునూరి రవీందర్, మున్యాల్

మలేషియా జైలు నుంచి స్వగ్రామానికి..

మలేషియా జైలు నుంచి స్వగ్రామానికి..