
పంగిడి అడవుల్లో అలుగు వేట
ఖానాపూర్: నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి అటవీ రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) పంచాయతీ పరిధి పంగిడి గూడెం అడవుల్లో అడవి అలుగును కొందరు వేటాడినట్లు ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్ఆర్వో కిరణ్ తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న ఖానాపూర్ మండలం జగన్నాథ్రావు చౌరస్తాలో కారులో వెళ్తున్న ముగ్గురితోపాటు అలుగు అవశేషాలు పట్టుకుని విచారించారు. అలుగును అడవి సారంగాపూర్కు తరలించి అక్కడి నుంచి క్రయవిక్రయాలు చేసే ముఠా సభ్యులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని విచారించగా మరో ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించి, మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో పట్టుకున్న వారిలో నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్. నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఎఫ్డీవో, ఎఫ్ఆర్వో పేర్కొన్నారు.
అక్రమ మార్గంలో సంపాదించేందుకే..
అక్రమ మార్గంలో సంపాదించేందుకే అడవి అలుగుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉందని కొందరు అపోహలు సృష్టించారు. దీన్ని కొనుగోలు చేస్తే సంపద రావడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని, రూ.5 లక్షలు ఆ పైచిలుకు ధరకు విక్రయించేందుకు ఈ దందాకు తెరలేపారు. అడవిలో పట్టుకున్న అలుగు నుంచి కరెంట్ ఉత్పత్తి అయ్యేలా చూపేందుకు ఫేక్ టెస్టర్ను తయారుచేసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.
10 మందిపై కేసు, అరెస్టు..
ఈ కేసులో ముందుగా నిజామాబాద్కు చెందిన ఫయాజ్, గంగాప్రసాద్తోపాటు జగిత్యాల జిల్లాకు చెందిన అహ్మద్ఖాన్ను పట్టుకుని విచారించారు. ఖానాపూర్ మండలానికి చెందిన గణేశ్, బారిక్రావు, నాగేశ్, విజయ్, నాగారావు, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్లకు చెందిన శ్రీరాం, జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్కు చెందిన రియాజ్ అహ్మద్ను గుర్తించి కేసు నమోదు చేశారు. వారి నుంచి 9 సెల్ఫోన్లతోపాటు ఒక కారు, బైక్, ఒక వెయింగ్ మిషన్, ఒక టెస్టర్, అలుగు పొలుసులు, ఒక అలుగును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ చేయనున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ అధికారి మహేశ్, ఎఫ్ఎస్వో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
10 మందిపై కేసు నమోదు, అరెస్టు
వెల్లడించిన ఎఫ్డీవో భవానీ శంకర్

పంగిడి అడవుల్లో అలుగు వేట

పంగిడి అడవుల్లో అలుగు వేట