వీడని చిక్కులు! | - | Sakshi
Sakshi News home page

వీడని చిక్కులు!

May 30 2025 1:52 AM | Updated on May 30 2025 2:00 PM

Farmers from Chamanapalle showing revenue pattas

తమకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని చూపిస్తున్న వేమనపల్లి మండలం చామనపల్లి రైతులు

అటవీ, రెవెన్యూ భూముల మధ్య సమస్య

గిరిజనేతరులు సాగులో ఉంటే తిప్పలే..

పోడు సాగుదారుల ఆక్రమణలపై సర్వే

అటవీ ఆక్రమణలుగా గుర్తించి స్వాధీనం

ఇటీవల వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు అటవీ భూములు సాగు చేస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. తమకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని ఇటీవల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు రైతులు వినతిపత్రం ఇవ్వగా.. అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదం తీరడం లేదు. జిల్లాలో ఇప్పటికీ ప లు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు, సాగుదారు ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో, తెలంగాణ ఏర్పడ్డాక 2023లోనూ గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఇచ్చిన పోడు పట్టాల సమయంలో ఒక రైతుకు గుంట భూమి నుంచి గరిష్టంగా పదెకరాల వరకు సాగులో ఉన్నా పట్టాలు ఇచ్చారు. అదే సమయంలో జిల్లాలో గిరిజనేతర రైతులు ఏడు వేల మంది పట్టాల కోసం వినతులు ఇచ్చినా వారికి పట్టాలు ఇవ్వలేదు. అర్హులుగా గుర్తించిన గిరిజనులైన 1847మందికి మొత్తం 3,821 ఎకరాల్లో పోడు పట్టాలు ఇచ్చారు. ఇంకా ఆయా చోట్ల గిరిజనేతరుల చేతిలో అటవీ భూమి ఆక్రమణలో ఉంది. ఈ భూమిని తిరిగి శాఖ ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఆ రైతులకు నోటీసులు ఇస్తూ హద్దులు నిర్ణయిస్తున్నారు.

తరచూ ఘర్షణలే..

జిల్లాలో పలు చోట్ల అటవీ, స్థానిక గిరిజన, గిరిజనేతర రైతుల మధ్య ఘర్షణలు జరిగాయి. గతంలో దండేపల్లి మండలం కోయపోచగూడలో జరిగిన ఘటన పెద్ద దుమారమే రేపింది. జన్నారం మండలం ఇందన్‌పల్లి, నెన్నెల మండలం కుశ్నపల్లి, కోనంపేట, వేమనపల్లి మండలం బుయ్యారంలో ఆక్రమణలపై నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంది. వీటితోపాటు కోటపల్లి మండలం సుపాక, ఆలు గామ, రొయ్యపల్లిలో పలువురు గిరిజన రైతులు అటవీ భూములు సాగులో ఉన్నా తమకు పట్టాలు రాలేదని వినతులు ఇస్తున్నారు. రీ సర్వే చేసి తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతున్నారు. తాజాగా చామనపల్లిలో భూ పంపిణీ కింద పట్టాలిచ్చినా.. రెవెన్యూ భూమి కాదని అటవీ భూమిగా పేర్కొంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులో అటవీ, రెవెన్యూ పట్టా మధ్య ఓ వివాదం ఉంది. అటవీ, రెవెన్యూ భూమి మధ్య స్పష్టమైన హద్దులు లేక సమస్యలున్నాయి. ఆక్రమణలపై ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయకపోతే కిందిస్థాయి సిబ్బందిపైనా వేటు పడుతోంది.

ఆక్రమణలపై సర్వేలు

ఏటా వానాకాలం సీజన్‌ ఆరంభంలో అటవీ శాఖ అప్రమత్తం అవుతోంది. ఎక్కడైనా అటవీ భూమి ఆక్రమణకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. సాంకేతికతను ఉపయోగించి, జియో మ్యాప్‌తో అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగించి ఫారెస్టు బీట్‌, కంపార్టుమెంట్ల వారీగా గుర్తిస్తున్నారు. గతంలో ఇచ్చిన పట్టా కంటే భూమి ఎక్కువగా వస్తే నోటీసులు ఇస్తున్నారు. ఆ భూమిలో సాగు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అయితే చాలా ఏళ్లుగా సాగులో ఉన్న గిరిజనేతర రైతులకు ఇది కష్టంగా మారింది. పోడు హక్కు పత్రాలు గిరిజనులకు మాత్రమే అందుతాయి. ఎవరైనా పోడు రైతులు సైతం పట్టా కంటే అధికంగా భూమి కబ్జాలో ఉన్నట్లు తేలినా నోటీసులు ఇస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement