● జిల్లాలో 23లక్షల మొక్కలు లక్ష్యం ● ఈత, తాటి వనాల అభివృద్ధికి చర్యలు
పాతమంచిర్యాల: జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని 16మండలాల్లో మొక్కలు నాటడానికి అనువైన స్థలాల ఎంపిక, గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపుల, పొలం, చెరువుగట్లు, బంజరు భూములు, హరితవనాలు, వైకుంఠధామాలు, ఇంటి ఆవరణలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మండలాల పరిధిలో ఉన్న నర్సరీల్లో పూల మొక్కలు గులాబీ, మల్లె, గుల్మోహర్, మందార, తులసీతోపాటు పండ్ల జాతులు జామ, అల్లనేరేడు, దానిమ్మ, చింత, ఖర్జూరా, వృక్షజాతులు టేకు, వేప, కానుగ, మునగ, ఈత, తాటి మొక్కలు నాటనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో స్థలాలు ఎంపిక చేశారు. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయిస్తున్నారు. జిల్లాలో ఈత, తాటి వనాల అభివృద్ధికి కల్లు గీత సొసైటీల ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చెరువులు, కాలువ గట్లపై నాటి అభివృద్ధి చేయనున్నారు.
మండలాల వారీగా..
జిల్లావ్యాప్తంగా 23లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించుకున్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. బెల్లంపల్లి మండలంలో 12,52,000, భీమారంలో 82,600, భీమినిలో 88,600, చెన్నూర్లో 2,20,950, దండేపల్లిలో 2,28,300, హాజీపూర్లో 1,25,200, జైపూర్లో 1,47,300, జన్నారంలో 2,12,980, కన్నెపల్లిలో 1,12,470, కాసిపేటలో 1,62,000, కోటపల్లిలో 2,27,900, లక్షెట్టిపేటలో 1,32,370, మందమర్రిలో 79,650, నెన్నెలలో 1,39,940, తాండూర్లో 1,10,470, వేమనపల్లిలో 1,04,070 మొక్కలు నాటాలని నిర్ణయించారు.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
ఈ ఏడాది వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే నర్సీల్లో మొక్కల పెంపకం చేపట్టాం. లక్ష్యాన్ని అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మొక్కలు నాటేందుకు గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూలైకి మందే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తాం.
– ఎస్.కిషన్, డీఆర్డీవో
వన మహోత్సవానికి సన్నద్ధం