
కరోనాపై అప్రమత్తం
● మాస్క్ ధరించాలంటున్న డాక్టర్లు ● అందుబాటులోకి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ● అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్యశాఖ
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజ లు జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ వినియోగించాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు నోటికి, ముక్కుకు అడ్డుగా రుమాలు అడ్డు పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, బాలింతలు, పిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో కరోనా కేసులు లేకున్నా ముందు జాగ్రత్తలతోనే అడ్డుకోవాలి.
– డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్యాధికారి
మంచిర్యాలటౌన్: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులతో పలువురు బాధపడుతున్నారు. ఇదే సమయంలో కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు. వాతావరణం పగలంతా వేడిగా, రాత్రి చల్లగా ఉండడం, వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలున్నా యి. జిల్లాలో కరోనా కేసులు నమోదు కానప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కరోనా టెస్టులు, చికిత్స కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటు, కరోనా నిర్ధారణ కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పని తీరు, ఆస్పత్రి ఆవరణలోనే గతంలో ఏర్పాటు చేసి న ఆక్సిజన్ ప్లాంట్ పనితీరుపై ఉన్నతాధికారులు మంగళవారం ఆరాతీశారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను సిద్ధం చేస్తున్నారు. కరోనా సోకినవారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలోనే గతంలో 20 బెడ్లతో కూడిన ఐసీయూ వా ర్డు ఏర్పాటు చేసి వినియోగించగా, అవసరమైతే దా నినీ వినియోగంలోకి తేవాలని భావిస్తున్నారు. జి ల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ మంగళవారం వైద్యులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులతోపాటు కరో నా వస్తే ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత అనుభవాల దృష్ట్యా..
2020లో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు వేలాదిమంది దాని బారిన పడగా వందలాది మంది మృత్యువాత పడ్డారు. 2020 నుంచి 2023 వరకు జిల్లావ్యాప్తంగా 10,75,447 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 57,305 మంది పాజిటివ్ వచ్చి నట్లు నిర్ధారించారు. ఇందులో 205 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. కరోనా తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా చేపట్టడంతో జిల్లాలోని 5,60,986 మందికి వ్యాక్సిన్ రెండు డోసులు వేశారు. బూస్టర్ డోస్ 3లక్షల మంది మాత్రమే వేసుకున్నారు. ఆ తరువాత కరోనా తగ్గిపోయింది. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకున్నందున కరోనా రాదనే ధీమాతో ఉన్నారు. అయినా 2023లో మరోసారి కరోనా రావడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. ప్రస్తు తం మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా ఉన్నతాధికారులనూ అప్రమత్తం చేసి వైరస్ వ్యాప్తి చెందితే సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. గతంలో కరోనా వైరస్ను జిల్లా అధికార యంత్రాంగం దీటుగా ఎదుర్కోగా, జిల్లాలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నవారికి సన్నిహితంగా ఉండకుండా, తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనాపై అప్రమత్తం