
ఆదాయం ఉన్నా అద్దె భవనంలోనే..
వాహనదారులకు
ఇబ్బందులు లేకుండా..
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సేవలు అందేలా చూస్తున్నాం. మరో నెలరోజుల్లో సీసీసీ పాతపోలీస్ స్టేషన్ పక్కన క్వార్టర్స్లోకి తాత్కాలికంగా ఆర్టీవో కార్యాలయాన్ని తరలిస్తాం. సిమెంట్ పనులతోపాటు విద్యుత్, పేయింట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. సర్వర్, నెట్ సమస్యలు తలెత్తకుండా రవాణా శాఖ కమిషనర్ నుంచి తరలింపుకు ఆదేశాలు రాగానే సీసీసీలో కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
– సంతోష్కుమార్, డీటీవో, మంచిర్యాల
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ప్రభుత్వానికి గణనీయమైన ఆదా యాన్ని సమకూరుస్తుంది. అయినా సొంత భవనం లేకుండా హాజీపూర్ మండలం వేంపల్లి శివారులోని అద్దె భవనంలో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా సొంత భవనం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నా, ఎటువంటి పురోగతి సాధించలేదు. ఇటీవల నస్పూర్లో 5 ఎకరాల స్థలంలో కార్యాలయ నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి. అయితే ఐదెకరాలు ఎలా సరిపోతాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్థల కేటాయింపు సమస్యలు
నస్పూర్లోని సర్వే నంబర్ 72లో 9.15 ఎకరాల స్థలం ఆర్టీవో కార్యాలయానికి కేటాయించగా, ఒక ఎకరం కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలకు, 2.20 ఎకరాలు జాతీయ రహదారి నిర్మాణానికి కేటాయించారు. మిగిలిన 5 ఎకరాల్లో కార్యాలయం, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, పార్కింగ్ వసతులు ఏర్పాటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గతంలో ఈ స్థలంలో ఒకరోజు వాహన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఎలాంటి కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించడం లేదు.
దూర భారం..
నస్పూర్లో ఆర్టీవో కార్యాలయం నిర్మిస్తే జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంక్లిష్టమైన మార్గం కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, నిరక్షరాస్యులు రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఫిట్నెస్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా
ఆర్టీవో కార్యాలయ నిర్మాణానికి రూ.9 కోట్ల వ్యయం అవుతుందని రహదారులు, భవనాల శాఖ అంచనా వేసింది. ప్రస్తుత డీటీవో సంతోష్ నేతృత్వంలో నిర్మాణ పనులకు నివేదిక సిద్ధమై, అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అందుబాటులో ఉన్న వేంపల్లి, ముల్కల్ల, గుడిపేటలోని స్థలాలను పరిగణనలోకి తీసుకోకుండా నస్పూర్లో గందరగోళ స్థల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి.
తాత్కాలిక ఏర్పాటు
సొంత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు రవాణా కార్యాలయాన్ని సీసీసీ సింగరేణి ప్రాంతంలోని పాత పోలీస్ స్టేషన్ పక్కన ఆర్టీవో కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించనున్నారు.
రవాణా కార్యాలయానికి సొంత భవనం కరువు
నస్పూర్లో ఐదేళ్ల క్రితం స్థలం కేటాయింపు..
భవన నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా..
తాజాగా జిల్లా కేంద్రానికి దూరంగా తరలింపునకు కసరత్తు

ఆదాయం ఉన్నా అద్దె భవనంలోనే..