రోడ్లపై ప్రమాద ఘంటికలు | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై ప్రమాద ఘంటికలు

May 26 2025 10:02 AM | Updated on May 26 2025 10:02 AM

రోడ్లపై ప్రమాద ఘంటికలు

రోడ్లపై ప్రమాద ఘంటికలు

సాక్షిప్రతినిధి, మంచిర్యాల: జిల్లా రహదారులు నిత్యం నెత్తుటి చారలతో ఆందోళనకరంగా మారుతున్నాయి. జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరిగింది. దీనికితోడు అజాగ్రత్త, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మంచిర్యాల–ఆసిఫాబాద్‌ రహదారి (ఎన్‌హెచ్‌ 363)పై భారీ వాహనాలు, బైక్‌లు, కార్లు, ఆటోలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ప్రమాదాలు అధికమవుతుండగా, తీవ్రత పెరిగి మరణాలు సంభవిస్తున్నాయి.

సౌకర్యాల కొరత, నిర్వహణలో జాప్యం

శ్రీరాంపూర్‌ రింగ్‌ రోడ్డు వద్ద అటవీ అనుమతుల కొరతతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయి, ప్రమాదకరంగా మారింది. గతంలో ఇక్కడ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. నస్పూర్‌ కృష్ణకాలనీ నుంచి దొరగారిపల్లె వరకు సర్వీస్‌ రోడ్లు, హై మాస్ట్‌ లైట్లు లేవు. సౌర విద్యుత్‌ వీధి లైట్లు పనిచేయక, రాత్రి వేళ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత మంచిర్యాల నుంచి రసూల్‌పల్లి వరకు బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించినప్పటికీ, డివైడర్లు, రేడియం స్టిక్కర్లు, సిగ్నల్స్‌ ఏర్పాటు చేయలేదు. గ్రామీణ రోడ్లపై గుంతలు, చెట్ల పొదలు, మట్టి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

యాక్సిడెంట్‌ స్పాట్లు..

బోయపల్లి, కన్నాల క్రాస్‌, సోమగూడెం చర్చి, బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రి నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు, మందమర్రి సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మందమర్రి ఓవర్‌ బ్రిడ్జి, తదితర ప్రాంతాల్లో చాలాసార్లు లైట్లు వెలగడం లేదు. శ్రీరాంపూర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోనే అటవీ అనుమతులు లేకుండా నిలిచిపోయిన రోడ్డు ప్రమాదకరంగా మారింది. శ్రీరాంపూర్‌ వద్ద జంక్షన్‌లా నిర్మించి, హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, కేవలం సూచిక బోర్డులే ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి.

రహదారి భద్రత కమిటీ నిర్లక్ష్యం

రహదారి భద్రత కమిటీ ప్రమాద ప్రాంతాలను గుర్తించినప్పటికీ, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. పోలీసు, ఆర్టీఏ, రహదారుల ఇంజినీరింగ్‌, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతను పర్యవేక్షించాలి. అత్యవసర హెల్ప్‌లైన్‌ 1033 తరచూ పనిచేయక, 108 సేవలే ఆధారంగా ఉన్నాయి. రోడ్డు నిర్వహణ, మరమ్మతుల్లో జాప్యం కొనసాగుతోంది.

ప్రభుత్వ సాయంపై అవగాహన లోపం

రోడ్డు ప్రమాద గాయపడిన వారికి కేంద్రం రూ.2 లక్షల సాయం అందిస్తుంది. దీనిపై ప్రచారం లేదు. జిల్లాకు ట్రామాకేర్‌ మంజూరైనా అందుబా టులో లేదు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కొరతతో గాయపడినవారిని కరీంనగర్‌, హైదరాబాద్‌ తరలిస్తున్నారు. రహదారి భద్రత, వైద్య సౌకర్యాలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.

జిల్లాలో తగ్గని రోడ్డు ప్రమాదాలు

పెరుగుతున్న మరణాలు..

అజాగ్రత్తలు, నిర్లక్ష్యమే

ప్రధాన కారణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement