
● అకాల వర్షాలతో ఇప్పటికే చల్లబడిన వాతావరణం ● చల్లని కబు
ఈ ఏడాది సాగు విస్తీర్ణం
ఎకరాల్లో, విత్తనాలు, ఎరువులు
సాగు విస్తీర్ణం 3,33,565 ఎకరాలు
పత్తి విత్తనాలు 3,40,306 ప్యాకెట్లు
ఇతర విత్తనాలు 32,324 క్వింటాళ్లు
రాయితీ విత్తనాలు
7,690 క్వింటాళ్లు(జిలుగ, జనుము)
ఎరువులు 1,10,205మెట్రిక్టన్నులు
మంచిర్యాలఅగ్రికల్చర్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో నాలుగైదు రోజులుగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. గత వారం వరకు ఎండలు మండిపోగా, ఈ వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో ఇప్పటికే రైతులు పొలం బాట పడుతున్నా రు. ఆదివారం రోహిణి కార్తె ప్రారంభంతో పూర్తిస్థాయిలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు పేర్కొంది. దీంతో జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలు పలకరిస్తాయని అంచనా వేసింది.
సాగుకు రైతులు సన్నద్ధం..
వానాకాలం సాగుకు రైతులు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు దున్ని, చేలను సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు రైతులు సేంద్రియ, కర్బన విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఈ వానాకాలం 3,33,565 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఈమేరకు ప్రణాళిక రూపొందించింది. అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసి రాయితీపై రైతులకు అందిస్తోంది. పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు, జిలుగ, జనుము విత్తనాలను మండలాలకు తరలిస్తున్నారు.
గతేడాది సవాళ్లు.. ఈ ఏడాది ఆశలు
గత ఖరీఫ్లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు నిండినప్పటికీ, వానాకాలం సాగు ఆలస్యమైంది. దీని ప్రభావంతో యాసంగి పంటలు కూడా ఆలస్యమయ్యాయి. మార్చి, ఏప్రిల్లో రావాల్సిన దిగుబడి మే నెలలో కోతకు వచ్చింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు తెలుపడంతో రైతులు ఆశాభావంతో సాగుకు సిద్ధమవుతున్నారు.
వరి, పత్తికే ప్రాధాన్యం..
గతేడాది 3,18,786 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది 3,33,565 ఎకరాల్లో సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి, వరి, పప్పు దినుసుల సాగును పెంచాలని ప్రభుత్వం సూచిస్తోంది. పత్తి సాగు 1,56,000 ఎకరాల నుంచి 1,58,753 ఎకరాలకు, వరి సాగు 1,60,000 ఎకరాల నుంచి 1,58,161 ఎకరాలకు, కందులు 1,054 ఎకరాలు, మొక్కజొన్న 531 ఎకరాలు, పెసలు 116 ఎకరాలు, మినములు 69 ఎకరాలు, ఇతర పంటలు 14,881 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక సిద్ధం చేసింది.
వర్షపాతం అంచనాలు
ఈ ఏడాది వానాకాలం సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. జూన్లో 195.2 మిల్లీ మీటర్లు, జూలైలో 338.5 మి ల్లీమీటర్లు, ఆగస్టులో 323.1 మిల్లీమీటర్లు, సెప్టెంబర్లో 130.4 మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా నమోదవుతుందని అంచనా. గడిచిన మూడేళ్లు వ ర్షాలు ఆలస్యంగా కురవడం, చివరన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ముందస్తు రుతుపవనాలతో సాగు సమయానికి జరిగే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
రైతులకు సూచనలు
వ్యవసాయ అధికారులు ముందస్తు సాగుకు సిద్ధమవ్వాలని, విత్తనాలు, ఎరువులు, రుణాలు, పెట్టుబడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులైన జిలుగ, జనుము విత్తనాలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.