
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
● ఈ నెల 15నుంచి 26వరకు.. ● రోజుకు 30 అదనపు సర్వీసులు ● ఒకటిన్నర శాతం అధిక చార్జీ
మంచిర్యాలఅర్బన్/చెన్నూర్: జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతీ పుష్కరా లకు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. పుష్కర స్నానాలకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈనెల 15 నుంచి 26వరకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. మంచిర్యాల, చెన్నూర్ నుంచి కాళేశ్వరం వరకు రోజూ 30 ప్రత్యేక బస్సులు నడిపేలా కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల రైల్వేస్టేషన్కు చేరుకునే వీలుంది. ఆదిలాబాద్, నిర్మల్ ఇతర ప్రాంతాల నుంచి మంచిర్యాల మీదుగా వెళ్లే ప్రయాణికులతో రద్దీ పెరిగే అవకాశాలున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ బస్సులు పోనూ అదనపు బస్సులు నడిపి ఆదాయం సమకూర్చుకునేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతోంది. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణ చార్జీ కంటే అదనం
మంచిర్యాల నుంచి కాళేశ్వరం వెళ్లే భక్తులకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. సాధారణ చార్జీలతో పోల్చుకుంటే ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర శాతం అదనపు చార్జీ వసూలు చేసేందుకు నిర్ణయించింది. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తించనుంది. మంచిర్యాల నుంచి కాళేశ్వరం పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80, శ్రీరాంపూర్ నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.70, చెన్నూర్ నుంచి పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.50 చార్జీగా నిర్ణయించారు.
‘పుష్కర’ విధులకు పీఆర్ ఉద్యోగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాలకు మంచిర్యాల జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ జిల్లా, మండల స్థాయి ఉద్యోగులకు విధులు కేటాయిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ సుధాకర్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) వెంకటేశ్వర్రావుతో పాటు డీఎల్పీవో సఫ్దర్అలీ, ఎంపీడీవోలు సత్యనారాయణ (జైపూర్), మోహన్(చెన్నూర్), రాజేశ్వర్ (మందమర్రి), లక్ష్మయ్య (కోటపల్లి), ప్రసాద్(దండేపల్లి), మండల పంచాయతీ అధి కారులు (ఎంపీవో) శ్రీపతి బాపు (జైపూర్), అజ్మత్అలీ (చెన్నూర్), సత్యనారాయణ (మందమర్రి), శ్రీనివాస్ (లక్సెట్టిపేట), బీ శ్రీనివాస్ (బెల్లంపల్లి), ప్రసాద్ (దండేపల్లి), అనిల్ (తాండూర్), అక్తర్ మొయినొద్దీన్ (కోటపల్లి), శ్రీనివాస్ (నెన్నెల), శ్రీనివాసరెడ్డి (వేమనపల్లి), ఉమర్షరీఫ్ (హాజీపూర్)కు విధులు కేటాయించారు. వీరంతా కాళేశ్వరంలో 12 రోజులపాటు నిర్వహించనున్న సరస్వతీ పుష్కరాల్లో వివిధ విధులు నిర్వర్తిస్తారు. పారిశుధ్య నిర్వహణ పనులను పర్యవేక్షిస్తారు.
రద్దీకి అనుగుణంగా సర్వీసులు
కాళేశ్వరానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. ఆర్టీసీ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాసులు, మంచిర్యాల డిపో మేనేజర్

సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు