
రెచ్చగొట్టే పోస్టులుపెడితే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సిగరేట్ తాగడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే రౌడీషీటర్ సిగరేట్ తాగుతూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలోని ఎగ్జిబిషన్ వ్యాపారిని సయ్యద్ మోసిన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడగా అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో కత్తులు, నిర్లక్ష్య డ్రైవింగ్, సిగరెట్ తాగుతూ రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఒకరిపై చీటింగ్ కేసు
ఆదిలాబాద్రూరల్: ఇచ్చోడలోని మాధపూర్కు చెందిన మల్లేశ్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. రాంనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వహబొద్దీన్కు ఫోన్చేసి ఫర్నీచర్పై రూ.5 లక్షల స్కీమ్ ఉందని, మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బిల్స్తో రుణం వస్తుందని మాయమాటలు చెప్పాడు. తాను ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాని చెప్పి రూ.20వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పడంతో బాధితుడు రూ.18వేలు ఫోన్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండడంతో బాధితుడు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
విధులకు ఆటంకం కలిగించిన వారిపై..
ఆదిలాబాద్టౌన్: పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. తాంసి మండలంలోని సవర్గాంకు చెందిన గజకంటి ప్రభాకర్ పంచాయతీ కా ర్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో పలువురు నాయకులు మంగళవారం మృతదేహంతో జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో డీపీవో శ్రీలత ఫిర్యాదు మేరకు అనుము ల కిరణ్, బొజ్జ ఆశన్న, అలాలి అజయ్, లంకా రాఘవులు, ఎ.మల్లేశ్, అగ్గిమల్ల స్వామితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.