● వార్షిక ఉత్పత్తికి దూరంగా శ్రీరాంపూర్ గనులు ● ఇప్పటికీ 89శాతమే ఉత్పత్తి
శ్రీరాంపూర్: సింగరేణి వార్షిక ఉత్పత్తి లక్ష్యసాధనకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈలోగా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. కానీ కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2024 ఏప్రిల్ 1నుంచి ఈ ఏడాది మార్చి 17వరకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 60.38 లక్షల టన్నులకు గాను 53.66 లక్షల టన్నులు మాత్రమే సాధించింది. దీంతో 89శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసింది. ఈ ఉత్పత్తిలోటు పోను మిగిలిన రెండు వారాల్లో ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఇందారం ఓసీపీలో ఉత్పత్తి లక్ష్యం సాధించకపోవడంతో దాని ప్రభావం ఏరియా లక్ష్యాల సాధనపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఓసీపీలో ఓబీ పనుల్లో జాప్యం, కాంట్రాక్టర్ నిర్దేశిత ఓబీ తీయకపోవడం వల్ల అతి తక్కువగా 42శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. గత సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యానికి దూరంగా ఉన్న శ్రీరాంపూర్ ఓసీపీ ఈ ఏడాది లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఏరియాల్లోని అన్ని గనుల కంటే శ్రీరాంపూర్ ఓసీపీ 111శాతం బొగ్గు ఉత్పత్తితో ముందుంది. గనుల్లో ఇటీవల యువ కార్మికుల గైర్హాజరు ప్రభావం వార్షిక ఉత్పత్తి లక్ష్యంపై పడింది. మిగిలిన రోజుల్లో ఏరియాలోని గనులు రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ పోయిన కూడా వంద శాతం సాధించడం సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు భావిస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కోసం ఇన్సెంటివ్ స్కీం పెట్టిన అది నామమాత్రమే ప్రఽభావాన్ని చూపిందని అంటున్నారు.
గనుల వారీగా మార్చి 17నాటికి సాధించిన ఉత్పత్తి వివరాలు (టన్నుల్లో)
గని లక్ష్యం సాధించింది శాతం
ఆర్కే 5 259440 236903 91
ఆర్కే 6 172800 182413 106
ఆర్కే 7 345600 295280 85
ఆర్కే న్యూటెక్ 153520 163831 107
ఎస్సార్పీ 1 115008 88315 77
ఎస్సార్పీ 3, 3ఏ 268960 226778 84
ఐకే 1ఏ 229920 185880 81
ఎస్సార్పీ ఓసీపీ 3056000 3381329 111
ఐకే ఓసీపీ 1437600 606997 42
మొత్తం 6038848 5367726 89