చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయిస్తున్న దుకాణాలను గురువారం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ నిబంధనల ప్రకారం 2025–26 సంవత్సరానికి టెంకాయలు, పూజసామగ్రి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు కోన రాజశేఖర్, రాకేష్ ఆలయ నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ దుకాణాలను గురువారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తుల బాల్రాజు, ఈఓ మదనేశ్వరెడ్డి మట్లాడుతూ.. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించి భక్తులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. అందుకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


