 
															గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నాగర్కర్నూల్ క్రైం: మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు సమీపంలో కల్వర్టు వద్ద వరదలో గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్(41) కూలీ పనులు చేసుకుంటూ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత పనుల మీద బుధవారం సాయంత్రం ట్రాక్టర్పై నాగనూలుకి వెళ్లి మరో వ్యక్తితో కలిసి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో కల్వర్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరదను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నీటిలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు రాత్రి కావడంతో చర్యలు నిలిపివేశారు. గురువారం ఉదయం గాలించగా గల్లంతైన కరుణాకర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
గుంతలో పడి
బాలుడు మృతి
మిడ్జిల్: గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన గురువారం సాయంత్రం మండలంలోని బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు రిత్విక్ (3) గురువారం ఇంటి ఎదుట ఆడుకుంటూ సమీపంలో ఇటీవల విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతలో పడిపోయాడు. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఆ గుంతతో నీరు నిలిచింది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు బయటకు తీసి వెంటనే జడ్చర్ల ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
నలుగురికి గాయాలు
మహమ్మదాబాద్: ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాలు.. రోషన్ అనే వ్యక్తి ముంబై నుంచి కర్నూలుకు కొత్త ట్రాలీ బొలెరో వాహనాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇదే సమయంలో మహబూబ్నగర్ నుంచి కారులో విష్ణు, మల్లేష్, శేఖర్ గండేడ్ వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో నంచర్ల గేటు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించగా అంబులెన్స్ డ్రైవర్ అక్బర్, ఈఎంటీ మహబూబ్పాష ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
నవాబుపేట: మండలంలోని కాకర్లపహడ్ గ్రామానికి చెందిన ముర్గని రామచంద్రయ్య(50) పొలానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఈ నెల 25న మధ్యాహ్న సమయంలో రామచంద్రయ్య పొలానికి వెళ్తుండగా జిల్లా కేంద్రం నుంచి నవాబుపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. గాయపడిన రామచంద్రయ్యను గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. రామచంద్రయ్య భార్య ముర్గని మాసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.
భార్య హత్య కేసులో యావజ్జీవ శిక్ష
బిజినేపల్లి: మండల కేంద్రానికి చెందిన జహీదాబేగం హత్య కేసులో నిందితుడైన భర్త అబ్దుల్ నబీకి నాగర్కర్నూల్ జిల్లా జడ్జి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. పూర్తి వివరాలు.. బిజినేపల్లికి చెందిన జహీదాబేగానికి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అలూరుకు చెందిన అబ్దుల్నబీతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. 2022లో అబ్దుల్ నబీ భార్య జహీదాబేగాన్ని కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ క్రమంలో పోలీసులు చిన్నునాయక్, పీసీ రమేష్, అడిషినల్ పీపీ హైమద్అలీ సాక్షులను కోర్టులో హాజరుపర్చగా, వాదనల అనంతరం నిందితుడికి జడ్జి శిక్ష విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
 
							గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
 
							గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
