 
															జూరాలకు స్వల్పంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 27 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు ఇన్ఫ్లో 20 వేలకు తగ్గింది. విద్యుదుత్పత్తి నిమిత్తం 30,468 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 24 క్యూసెక్కులు, కుడి కాల్వకు 260 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 30,752 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.234 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
8 యూనిట్లలో..
జూరాల దిగువ, ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు.
పూర్తిస్థాయికి చేరువలో..
దోమలపెంట: శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగుల వద్ద 215.8070 టీఎంసీల సామర్థ్యం కాగా గురువారం జలాశయంలో 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 30,468, సుంకేసుల నుంచి 22,230, హంద్రీ నుంచి 1,125 మొత్తం 53,823 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,937 మొత్తం 62,252 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1,984 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.250 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 8.545 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. .

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
