
అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి..
● ఆటోను తగులపెట్టిన వ్యక్తి
● భార్యాపిల్లలపై పెట్రోల్ పోసేయత్నం..
● అడ్డుకున్న ఇతర వాహనదారులు
ఐదేళ్లుగా తిరుగుతున్నాడు
మాల శంకర్కు వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడం కోసం ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఇటీవల ధరణిలో రావడంతో అప్పటి నుంచి పాసు పుస్తకంతో పాటు ఓఆర్సీ సర్టిఫికెట్ కోసం దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల ధరణిలో నమోదు కావడంతో ఓఆర్సీ, పట్టాదారుపాస్ పుస్తకం మ్యాన్వల్గా ఇవ్వడానికి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని విసిగిపోయాడు. ఈ ఘటనపై దేవరకద్ర ఆర్ఐని ‘సాక్షి’ వివరణ కోరగా మాల శంకర్ 45రోజుల కిందట భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నాడని, దీనిపై విచారణచేసి ఫైల్ తహసీల్దార్కు ఇచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ సంతకాలు చేసి ఫైల్ ఆర్డీఓ కార్యాలయానికి పార్వర్డ్ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఫైల్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మహబూబ్నగర్ ఆర్డీఓకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
మహబూబ్నగర్ క్రైం: తనకు వారసత్వంగా వచ్చిన భూమికి విరాసత్ చేయకుండా గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ అధికారులు వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన ఓ ఆటో డ్రైవర్ మొదట ఆటోపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఆ తర్వాత భార్యాపిల్లలపై పెట్రోల్ పోయడానికి యత్నించే క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు పెట్రోల్ బాటిల్ను తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన మాల శంకర్కు తన తండ్రి నుంచి 1ఎకరం 3 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. ఈ భూమిని విరాసత్ చేయడానికి 5 ఏళ్ల కిందట నుంచి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినా అధికారులు నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది మార్చిలో భూమికి సంబంధించిన ఓఆర్సీ హక్కులు సైతం శంకర్కు వచ్చాయి. దీనిని ఆన్లైన్ నమోదు చేసి మ్యాన్వల్గా ఓఆర్సీ సర్టిఫికెట్, పట్టదారు పాస్పుస్తకం ఇవ్వాలని మూడు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయాడు. చివరకు సోమవారం సాయంత్రం తనకు సంబంధించిన ఆటోను పాలమూరు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత కొంత పెట్రోల్ను భార్య, ముగ్గురు అమ్మాయిలపై పోయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు అడ్డుకున్నారు. మొదట ఆటోలో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు దించి వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఆటోపై పోసి ఆ తర్వాత నిప్పు అంటించడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి టూటౌన్ పోలీసులు, మహబూబ్నగర్ రెవెన్యూ అధికారులు చేరుకుని వివరాలు సేకరించారు. మహబూబ్నగర్ అర్భన్ డీటీ దేవేందర్ ఆధ్వర్యంలో రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందించారు.