
పాము కాటుతో యువకుడి మృతి
మల్దకల్: యువకుడు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన మండలంలోని అడివిరావల్చెర్వు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగరాజు (20) బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని అక్కడే ఉన్న గుడిసెలో నిద్రించాడు. తెల్లవారుజూమున నిద్రలేవకపోవడంతో కుటుంబసభ్యులు పాము కాటు వేసినట్లు గుర్తించి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
తీర్థయాత్రలకు వెళ్లొస్తూ అనంతలోకాలకు
మానవపాడు: మండల కేంద్రానికి చెందిన బోయ మూగి మద్దిలేటి అనే వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మద్దిలేటి మరో నలుగురు గ్రామస్తులతో కలిపి ఈ నెల 5న కాశీ, అయోధ్యను సందర్శించడానికి వెళ్లాడు. యాత్రలు ముగించుకొని రైలులో తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ రైల్వేస్టేషన్లో మరణించాడు. పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, అక్కడి నుంచి అంబులెన్స్ ద్వారా మానవపాడుకు పంపారు. మద్దిలేటి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మల్దకల్: విద్యుత్ సర్వీస్ వైర్ను సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పావనంపల్లి గురువారం జరిగింది. వివరాలు.. పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు పరుషరాముడు(45) ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తన ఇంటికి తీసుకున్న సర్వీస్ వైర్ సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని భార్య శారదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, మండల నాయకులు ఆస్పత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
తెలకపల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలకపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. బల్మూరు మండలం జినుకుంటకు చెందిన కురాకుల మహేశ్ (32), తన భార్య విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత అతడికి దూరపు బంధువు అయిన తెలకపల్లి మండలం లక్ష్నారం గ్రామానికి చెందిన శివలీలతో పరిచయమైంది. ఆమె కూడా తన భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్న క్రమంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇటీవల శివలీల మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడటాన్ని గమనించిన భర్త మహేశ్ నిలదీశాడు. అయితే తన ప్రవర్తన మార్చుకోని శివలీల.. కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా 10 రోజులు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె అదృశ్యం కావడంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీని కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత తెలకపల్లిలో నివాసం ఉన్నప్పటికీ శివలీల తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త మహేశ్.. తెలకపల్లిలో తన సోదరి అంజలి నివాసముంటున్న అద్దె ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి దాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
యువకుడి బలవన్మరణం
తెలకపల్లి: క్షణికావేశంలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. మండలంలోని పెద్దూరుకు చెందిన పబ్బాల పరశురాములు (28) రెండు నెలలుగా ఎలాంటి పని చేయకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండటంతో భార్య, తల్లిదండ్రులు మందలించారు. దీంతో గురువారం ఉదయం ఇంట్లో సీసాలో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. తండ్రి పబ్బాల కురుమయ్య ఫిర్యాదు మేరకు సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. పరశురాములుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.