
పాతికేళ్లకు వృద్ధ భారతం!
uమొదటి పేజీ తరువాయి
రెట్టింపునకు మించి 34.7 కోట్లకు (జనాభాలో 20.8 శాతం) చేరుకుంటుందని అంచనా. ఇది దేశ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక అభద్రత, కుటుంబపరమైన సహాయ సహకార వ్యవస్థ క్షీణత, వైద్య, ఆరోగ్య సేవల విషయంలో అసమానతల పెరుగుదల లాంటి తదితర కారణాల వల్ల వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక అంశాలను ప్రభావితం చేస్తుండటం చర్చనీయాంశంగా ఉంది. భారత్ క్రమంగా వృద్ధ సమాజంగా మారనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఒక సంక్షోభంగా పరిణమించవచ్చుననే హెచ్చరికలు కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇండియాస్ ఏజింగ్ సొసైటీ: ద ల్యాండ్ స్కేప్ టుడే’– గివ్ గ్రాంట్స్ ఇండియా’ నివేదిక’లో ఇందుకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 (యూఎన్ఎఫ్పీఏ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సంయుక్త పరిశీలన), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ, నీతి ఆయోగ్ పరిశోధనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
29 శాతం మందికే పెన్షన్
పెన్షన్ అందని వృద్ధుల బతుకు భారంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలోని వృద్ధులలో 29% మందికే పెన్షన్ (వివిధ రూపాల్లో) లభిస్తోంది. దాదాపు 40% మంది వృద్ధులు అత్యల్ప ఆదాయ వర్గ కుటుంబాలకు చెందినవారు. వారి జీవితం.. భద్రమైన ఆదాయం, కుటుంబ మద్దతు తగ్గిపోతున్న ఈ కాలంలో మరింత కష్టతరంగా మారుతోంది. వృద్ధులపై జరిగే దౌర్జన్యాలలో 71% కేసులు మహిళలకు సంబంధించి ఉంటున్నాయి. దేశంలోని సగానికి పైగా వృద్ధులు మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ ఉపయోగించలేరు. ఇది వారిని సమాజం నుంచి పూర్తిగా వేరుచేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కు పైగా మాత్రమే వృద్ధుల వసతి గృహాలున్నాయి.
దెబ్బతీస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు...
ప్రస్తుతం వృద్ధులలో..50% మందికి అధిక రక్తపోటు, 43% మందికి మధుమేహం (డయాబెటిస్) 33% మందికి అస్తమా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నిత్యం వైద్య పర్యవేక్షణ అవసరమ య్యే పరిస్థితులు. కానీ దేశవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో మాత్ర మే గెరియాట్రిక్ వైద్య నిపుణులున్నారు. పౌర ఆరోగ్య బీమా పథకం ద్వారా 25% వృద్ధులకు మాత్రమే బీమా లభిస్తోంది.
వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు
అటల్ వయో అభ్యుదయ యోజన, జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, రాష్ట్రీయ వయోశ్రీ పథకం.
అయితే వీటిపై ప్రజల్లో అవగాహన లోపం, ఇవి సరిగా అమలు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాలకు చేరిక తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి.
ఏం చేయాలి?
పెన్షన్ వ్యవస్థను విస్తరించాలి. అసంఘటిత రంగం వృద్ధులకు కూడా చేరుకునేలా చూడాలి. అత్యాధునిక వృద్ధుల నివాస గృహాలు స్థాపించాలి. సహాయ జీవన, ఆరోగ్య ఆధారిత సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీరో టాలరెన్స్ పథకం – వృద్ధులపై దౌర్జన్యాలపై కఠినచర్యలు. డిజిటల్ సహిత వృద్ధులు – డిజిటల్ సాంకేతికతపై శిక్షణ. వృద్ధ మహిళల ప్రత్యేక పథకాల కు, ఆర్థిక స్వయం సాధన, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి.