
బడికి పోదాం.. చలో
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో ఆడిపాడిన పిల్లలు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. నెలన్నర రోజులుగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు సర్కారు బడుల్లో అడ్మిషన్లు భర్తీ చేసేందుకు పది రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 3,360 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. కాగా.. విద్యార్థులకు మొదటి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాం పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించాలని, అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు గతంలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, మార్కులతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 820 పాఠశాలలు ఉండగా.. అందులో 50 జీరో–టచ్ ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
● ఇప్పటి వరకు పార్ట్–1 పాఠ్య పుస్తకాలు 4,39,060 రావాల్సి ఉండగా 4,30,260 ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్విరార్మెంటల్ సైన్స్కు సంబంధించి 2 టైటిల్స్ పెండింగ్లో ఉన్నాయి. హైస్కూల్ విద్యార్థులకు సంబంధించి నోటు పుస్తకాలు 1.40 లక్షలు రావాల్సి ఉండగా 1.10 లక్షలను ఆయా పాఠశాలలకు అందజేశారు. 66 వేల యూనిఫాంలు కుట్టేందుకు మహిళా సంఘాలకు అప్పజెప్పగా.. కుట్టే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది.
ఆటాపాటలకు బైబై
జిల్లాలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ అందజేత
సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటింటి ప్రచారం
బడిబాట ద్వారా 3,360 మంది చేరిక
జిల్లాలో 50 పాఠశాలల్లో ఏఐ తరగతుల బోధన