
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి.. ఔత్సాహికులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలశాఖ, మున్సిపల్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు భాగస్వామ్యంతో విరివిగా పరిశ్రమలు ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. గ్రీన్ ఇండస్ట్రీయల్ సెజ్, పోలేపల్లి సెజ్లో వీధిలైట్ల ఏర్పాటు, రోడ్డు మరమ్మతు పనులను జూలైలోగా పూర్తిచేయాలని టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. అనంతరం టీ ఫ్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి వాహనాల మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్, ఎల్డీఎం భాస్కర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కె.నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ ఉన్నారు.
రైల్వే స్టేషన్లో నేస్తం ఫిర్యాదు కార్యక్రమం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో బుధవారం నేస్తం ఫిర్యాదు పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్కట్టా, ఐఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేస్తం కార్యక్రమం ద్వారా ఉద్యోగులు వ్యక్తిగతంగా శాఖ అధికారులను కలిసి తమ సేవా సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని పొందుతారని అధికారులు తెలిపారు. సమస్యను బట్టి వాటిని తక్షణం, వారం, 15 లేదా 30 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేగవంతమైన సమస్యల పరిష్కారం, సానుకూలమైన పని వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.
26న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూళ్లలో 4 తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 8–9 సంవత్సరాలు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారు ఎంపికలకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. పైన పేర్కొన్న ధ్రువపత్రాల్లో ఏది లేకున్నా ఎంపికలకు అనుమతించమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపికలు జూలైలో ఉంటాయని, మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం