
14న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ అధిక సంఖ్యలో పెండింగ్ కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్క విభాగం బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో 17,431 కేసులు రాజీ చేశామని, ఈనెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్ అంతా కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీస్శాఖ, బ్యాంకు నిర్వహకులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన కక్షిదారులు కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఇప్పటికే చెక్ బౌన్స్పై వారం రోజుల పాటు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి కేసులు రాజీ చేయనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి.. రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి కేసులో కక్షిదారులు హాజరుకావాలని సూచించారు. 14న నిర్వహించే లోక్ అదాలత్లో భాగంగా మహబూబ్నగర్ కోర్టులో ఆరు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 3,010 కేసులలో ఉన్న కక్షిదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసిన సందర్భంలో కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కోర్టుకు చెల్లించిన ఫీజు సైతం తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 8 బెంచీలు ఏర్పాటు
ఇప్పటికే 3వేల కేసుల్లో కక్షిదారులకు నోటీసులు జారీ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి