
యథేచ్ఛగా ఇసుక దందా
● రాత్రిపూట పట్టణంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్
● పట్టపగలు దర్జాగా పొక్లెయిన్లు, టిప్పర్లతో రవాణా
● వాహనాలను పట్టుకొని వదిలేసిన పోలీసులు
అనుమతులు ఉన్నాయని వదిలేశాం
బహార్పేటలో జేసీబీతో ఇసుకను టిప్పర్లో లోడ్ చేస్తున్న విషయంలో సమాచారం రాగానే ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించా. అనుమతి తీసుకొని మాగనూర్ నుంచి తెచ్చి ఇక్కడ నిల్వ చేసినట్లు రశీదులు చూపించారు. రవాణా చేయడం కుదరదని టిప్పర్లో లోడ్చేసిన ఇసుకను ఖాళీ చేయించి జేసీబీ, టిప్పర్ను వదిలేశాం.
– బాలరాజు, ఎస్సై, కోస్గి
కోస్గి: కొన్నిరోజులుగా కోస్గి పట్టణం అక్రమ ఇసుక దందాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. పట్టణంలోని బహార్పేట, సాయినగర్ కాలనీ, చెన్నారం రోడ్డు, సబ్స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి పూట ఇసుకను డంపింగ్ చేసి పగలు జేసీబీలతో టిప్పర్ల ద్వారా బహిరంగంగా విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం బహార్పేటలోని మహబూబ్నగర్–తాండూర్ ప్రధాన రహదారి పక్కనే నిల్వ చేసిన డంప్ నుంచి జేసీబీ, టిప్పర్ నుంచి ఇసుకను తరలిస్తున్నారు. గతకొన్ని రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారంపై అటుగా వెళ్తున్న కొందరు యువకులు ప్రశ్నించగా హైదరాబాద్ వరకు అమ్ముకునేదుకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులున్నాయని, అపడానికి మీరెవరంటూ ఇసుక మాఫీయా ఎదురు తిరగడంతో యువకులు స్థానిక విలేకర్లు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పట్టుకొని వదిలేసిన పోలీసులు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. వాహనాలను స్టేషన్కు తరలించకుండా టిప్పర్ నుంచి ఇసుకను ఖాళీ చేయించి వాహనాలను వదిలేశారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిస్తుండగా.. ఏకంగా ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలోనే ఇసుక అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. అక్రమ రవాణాను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో హద్దూ అదుపు లేకుండా పట్టపగలే జేసీబీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫీయా అందినంతా దండుకుంటుంది. అక్రమ దందాను అడ్డుకునేందుకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి వాహనాలను వదిలేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

యథేచ్ఛగా ఇసుక దందా

యథేచ్ఛగా ఇసుక దందా