
పెండింగ్ రైల్వే పనులు పూర్తి చేయాలని ఎంపీ వినతి
పాలమూరు: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులపై మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఢిల్లీలో ఎంపీ డీకే అరుణ వినతి పత్రం అందించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల హుబ్లీతో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత సులభతరం అవుతుందన్నారు. దీంతో పాటు పెండింగ్లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ పనులపై గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,256
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిమార్కెట్కు మంగళవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,256, కనిష్టంగా రూ.1,301 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,257, కనిష్టంగా రూ.6,247, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,838, కనిష్టంగా రూ.1,621, ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,605 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,100 ఒకే ధర లభించింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర మార్కెట్కు బుధవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.