
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి: ఎస్పీ
జడ్చర్ల: మహిళా పోలీసులు విధుల నిర్వహణలో మరింత చిత్తశుద్ధి, నిబద్ధత కనబరిచి అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్ల శివారులోని పోలీసు శిక్షణకేంద్రంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుశాఖలో విధులు, బాధ్యతలు, ప్రవర్తన నియమావళి, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. శిక్షణ దశ నుంచే ఉత్తమ సేవ ధ్యేయంతో ముందుకు సాగాలన్నారు. ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఎక్కడా ఆరోపణలకు, విమర్శలకు తావివ్వకుండా పారదర్శకంగా బాధితుల తరఫున నిలబడాలని సూచించారు. మహిళా సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిబాబు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆర్ఐ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.