
నేడు, రేపు ప్రత్యేక డ్రైవ్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 11, 12 తేదీల్లో బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించేందుకు కార్మికశాఖ, పోలీస్ సంబంధిత శాఖలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో బాలకార్మికులు, కౌమార దశ బాల కార్మికులపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీస్, కార్మిక శాఖ, బాలల సంరక్షణాధికారి, ఎన్జీఓలు ఇతర శాఖలతో మూడు బృందాలు ఏర్పాటు చేసి బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలో 14 ఏళ్ల లోపు బాల కార్మికులు, 14–18 ఏళ్ల వయసు ఉన్న కౌమార దశ బాలలు హాట్ స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్లు, ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, హోటళ్లలో వలస కుటుంబాలకు చెందిన బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారని, సంబంధిత యజమానులపై బాల, కౌమార బాల కార్మికుల చట్టం ప్రకారం వివిధ సెక్షన్ల కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని తెలిపారు. బాల కార్మికులను రక్షించి స్టేట్ హోంలో అప్పగించి వారికి కౌన్సెలింగ్ విద్య, వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశించారు. వలస కుటుంబాలు పని చేస్తున్న ప్రదేశాలలో వారి పిల్లలకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందించాలని సూచించారు. 1098 చైల్డ్ లైన్కు కూడా సమాచారం అందించాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీఆర్డిఓ నర్సింహులు, డీఏఓ వెంకటేశ్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మికులకు పునరావాసంకల్పించాలి
కలెక్టర్ విజయేందిర బోయి