
6 రోజుల్లో 29 దరఖాస్తులు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ముసాయిదా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాల దరఖాస్తుల స్వీకరణకు గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు 29 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో ఆయా డివిజన్ల సరిహద్దులను నక్షాలతో సరిచూసుకుంటున్న ప్రత్యేక బృందం తాజాగా 33 నుంచి 42వ డివిజన్ వరకు వెళ్లొచ్చింది. ఎక్కడికక్కడే టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఇతర సిబ్బంది కలిసి సవరించిన ఓటరు జాబితాను ముందుంచుకున్నారు. కొత్తగా ప్రతిపాదించిన డివిజన్ల పరిధిలో ఇంటి నంబర్ల ప్రకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓటర్లు ఉన్నారో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వారి పేర్లను పోలింగ్ కేంద్రం వారీగా విభజిస్తున్నారు.
పారదర్శకంగా చేపట్టాలి: బీజేపీ
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర రహదారులతో పాటు రైల్వేలైన్ విభజించకుండా అంతర్గత ప్రధాన రోడ్లను ఆధారంగా చేసుకొని జరగాలన్నారు. ముఖ్యంగా ఏ డివిజన్లో ఉన్న ఓటర్లు అదే డివిజన్లో వచ్చేలా చూడాలన్నారు. గతంలో ఓటరు ఒక వార్డులో ఉంటే ఓటు మాత్రం వివిధ చోట్ల ఉండేదన్నారు. ఇప్పుడు అలా జరగకుండా, ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేకుండా విభజించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు పద్మజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు రామాంజనేయులు, ఎ.అంజయ్య, జిల్లా నాయకులు నారాయణ, దర్పల్లి హరికృష్ణ, రఘు తదితరులు పాల్గొన్నారు.
స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు
కొనసాగుతున్న డివిజన్ల విభజన ప్రక్రియ

6 రోజుల్లో 29 దరఖాస్తులు