
అన్నదమ్ముళ్లను మింగిన పాంపాండ్
అచ్చంపేట రూరల్: తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పొలానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ముళ్లను పాంపాండ్ (నీటి గుంత) రూపంలో మృత్యువు వెంటాడింది. కళ్లెదుట ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు క్షణ కాలంలోనే విడతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోధన మిన్నంటింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మన్పల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల మేరకు.. బొమ్మన్పల్లికి చెందిన కుంభం సుధాకర్ – ధరణి దంపతులకు ఇద్దరు కుమారులు అక్షిత్(8), చేతన్ (6) ఉన్నారు. తమకు ఉన్న వ్యవసాయ పొలంలో సోమవారం పత్తి విత్తనాలు విత్తడానికి సిద్ధమయ్యారు. తమతో పాటు ఇద్దరు కుమారులను పొలానికి తీసుకెళ్లారు. పొలంలో తల్లిదండ్రులు పత్తి విత్తనాలు విత్తడంలో నిమగ్నం కాగా.. ఇద్దరు చిన్నారులు అక్కడే ఆడుకుంటూ సమీపంలో ఉన్న పాంపాండ్ వద్దకు వెళ్లారు. మొదట చేతన్ కాలుజారి నీటిగుంతలో పడిపోగా.. తమ్ముడిని బయటకు తీసుకొద్దామనే క్రమంలో అన్న అక్షిత్ అందులో పడిపోయాడు. ఇద్దరు నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందారు. అయితే తల్లిదండ్రులకు తమ కుమారులు కనిపించక పోవడంతో కేకలు వేశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి పాంపాండ్లోకి దూకి చూశారు. అందులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కళ్లెదుటే ఆడుకుంటున్న ఇద్దరు కుమారులు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు చిన్నారుల మృతితో బొమ్మన్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు.
అచ్చంపేట మండలం
బొమ్మన్పల్లిలో విషాదం