
‘ఇథనాల్’ అనుమతులు రద్దు చేయాలి
గద్వాల క్రైం: పచ్చని పల్లెలను కాలుష్యమయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీపీఎం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో పార్టీ శ్రేణులతో కలిసి రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సందర్శనకు సిద్ధమయ్యారు. అయితే సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్, పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును జాన్వెస్లీ తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్స్టేషన్ ఆవరణలోనే ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తినని చెప్పే సీఎం రేవంత్రెడ్డి పాలన ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందన్నారు. పచ్చని పల్లెలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, కూలీలు జీవన మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 11 గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేపడితే.. ఫ్యాక్టరీ నిర్వాహకులు బయటి వ్యక్తులతో దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బయటి వ్యక్తుల దాడులను ప్రతిఘటించిన రైతులు, ప్రజలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో లేని వ్యక్తులపై రాజకీయ జోక్యంతో కేసులు నమోదు చేయడం చూస్తుంటే, వ్యూహాత్మకమైన కుట్ర జరిగిందని చెప్పవచ్చన్నారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం ప్రజలు నిలదీస్తే.. అధికారం అడ్డుపెట్టుకుని రైతులపై బూటకపు కేసులు నమోదు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడంతో పాటు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలే తప్ప.. స్వలాభాలు, వారి ఏజెండాల కోసం పనిచేయడం దుర్మార్గమైన చర్యన్నారు. శ్రామిక, కర్షక, కూలీలు, ప్రజలకు సీపీఎం అండగా నిలబడి పోరాడుతుందన్నారు. అరెస్టయిన వారిలో సీపీఎం నాయకులు శ్రీరాంనాయక్, వెంకటస్వామి, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఈదన్న, రాజు, నర్సింహ తదితరులు ఉన్నారు.
కేంద్రం సమాధానం చెప్పాలి
గద్వాల టౌన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్– పాక్ మధ్య నెలకొన్న యుద్ధం తన చొరవతోనే ఆగిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. భారతదేశ విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. భారత్ జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలకు గల కారణాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అట్టడుగు కులాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు నింపి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతంతోనే విద్వేశ రాజకీయాలకు చరమగీతం పాడగలమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక పరిస్థితి పేరుతో వెనకడుగు వేయడం సరికాదన్నారు. గద్వాల జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పేదలపై పెత్తనం చెలాయిస్తున్న బంగ్లా రాజకీయాలకు వ్యతిరేకంగా అట్టడుగు కులాలు ఐక్యమై ప్రజా పోరాటాల ద్వారా వారిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
రైతులపై కేసులు ఎత్తివేయాలి
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ