కుంటలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కుంటలో పడి వ్యక్తి మృతి

Jun 10 2025 3:30 AM | Updated on Jun 10 2025 3:30 AM

కుంటల

కుంటలో పడి వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి: కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం పెద్దకారుపాములలో చోటుచేసుకున్నది. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాళ్లలింగస్వామి(37) సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామంలోని ఈదోనికుంటలో పడిమృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు కుంటలో గాలించగా.. అప్పటికే మృతిచెందగా.. మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి భార్య నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.

టిప్పర్‌ ఢీకొని

వృద్ధుడి దుర్మరణం

మిడ్జిల్‌: మిడ్జిల్‌–కొత్తూర్‌ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్‌ ఢీకొని మిడ్జిల్‌కు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై శివనాగేశ్వర్‌నాయుడు కథనం ప్రకారం.. మిడ్జిల్‌కు చెందిన మైసయ్య(65) సోమవారం ఉదయం కేఎల్‌ఐ కాల్వ సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్తున్నాడు. మిడ్జిల్‌–కొత్తూర్‌ రోడ్డుకు మట్టి తరలిస్తున్న టిప్పర్‌ ఢీ కొట్టడంతో మైసయ్య తీవ్రగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వృద్ధుడిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

బల్మూర్‌: పాత కక్షలతో తండ్రి, కుమారుడు కలిసి ఓ వృద్ధుడిపై దాడి చేయగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అచ్చంపేట సీఐ నాగరాజు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కమ్మరి రేణయ్య (72)ను అదే గ్రామానికి చెందిన బోయ ఎర్ర య్య, అతడి కుమారుడు శివ కలిసి పాత కక్షలతో ఆదివారం ఇంట్లో నుంచి బయటకు లాగి తీవ్రంగా చితకబాదారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో అచ్చంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం చూడగా మృతిచెంది ఉన్నాడని.. సోదరుడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. రేణయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందినట్లు తెలిపారు.

వ్యక్తి బలవన్మరణం

జడ్చర్ల: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న మహేశ్‌ కన్నారెడ్డి (30) ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మహేశ్‌ కన్నారెడ్డి జడ్చర్లలోని సాయినగర్‌లో నివాసం ఉంటూ జిమ్‌ నిర్వహిస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య తగాదాలతో మనస్థాపానికి గురై ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి టవల్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గుర్తించిన భార్య టవల్‌ను లైటర్‌తో కాల్చి కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేశ్‌ కన్నారెడ్డి తండ్రి మంద శేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

యువతిపై అత్యాచారం.. కేసు నమోదు

నవాబుపేట: మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన 19 ఏళ్ల యువతిపై అదే తండాకు చెందిన ప్రేమ్‌కుమార్‌నాయక్‌ అత్యాచారం చేయగా కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు. సోమవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు వివరించారు. ప్రేమ్‌కుమార్‌నాయక్‌ గిరిజన సంఘంలో జిల్లాస్థాయి హోదాలో ఉండటంతో పాటు అధికారపార్టీ నాయకుడని.. అతడికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు.

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

వనపర్తి రూరల్‌: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి వివరాల మేరకు.. పెద్దగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు (40 వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే వాడు. అతడి భార్య వెంకటమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. నాటి నుంచి అతడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన అతడు.. తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు తాడుతో ఉరేసుకున్నాడు. ఆలస్యంగా గమనించిన స్థానికులు తాడును తొలగించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు కుమ్మరి తరుణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుంటలో పడి వ్యక్తి మృతి 
1
1/1

కుంటలో పడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement