
ఉత్సాహంగా మహిళా క్రికెట్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ అండర్– 25 జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో ఎండీసీఏ ఉమెన్స్ రెడ్ టీం 53 పరుగుల తేడాతో ఎండీసీఏ ఉమెన్స్ బ్లూ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రెడ్టీం నిర్ణీత 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్ అనిత ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. 45 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు తీసి రెడ్ టీం గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఇతర క్రీడాకారిణులు అక్షర 43, ప్రతీక 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బ్లూ టీమ్ జట్టు 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జట్టులో ప్రవళిక 24, స్రవంతి 21 పరుగులు చేశారు. రెడ్ జట్టు బౌలర్లు మహేశ్వరి 5 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 4, సింధూజ 2 వికెట్లు తీశారు.
43 పరుగుల తేడాతో..
రెండో లీగ్ మ్యాచ్లో బ్లూ జట్టు 43 పరుగుల తేడాతో పింక్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్లూ జట్టు నిర్ణీత 25 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. జట్టులో కరీనా 34, ఆర్.స్వాతి 28, మంజుల 23 పరుగులు చేశారు. పింక్ జట్టు బౌలర్లు మేఘనాగౌడ్ 2, త్రివేణి, కవిత చెరో వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పింక్ జట్టు బ్లూ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 19.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో పవిత్ర 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. బ్లూ జట్టు బౌలర్ దివ్య రాథోడ్ 4.1 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా ప్రవళిక 2, నిర్మల, స్వాతి, తేజశ్రీ చెరో వికెట్ తీశారు.
భారత జట్టుకు ఆడాలి
జిల్లా క్రీడాకారిణులు క్రికెట్లో మెరుగైన ప్రతిభ కనబరిచి భారత జట్టుకు ఆడాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ వి.మనోహర్రెడ్డి అన్నారు. సమర్థ స్కూల్ మైదానంలో ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ను ప్రారంభించారు. క్రీడాకారిణులను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడారు. క్రికెట్లో మహిళలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమెన్స్ క్రికెట్లో క్రీడాకారిణులు తమ ప్రతిభచాటాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారిణులను క్రికెట్లో ప్రోత్సహించడం కోసం మొదటిసారిగా ఉమెన్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ నిర్వహిస్తున్నందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలిపారు. లీగ్లో రాణించే క్రీడాకారిణులను త్వరలో హెచ్సీఏ టోర్నమెంట్కు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో సమర్థ స్కూల్ డైరెక్టర్ యాదయ్యగుప్తా, ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు రెడ్, బ్లూ జట్ల గెలుపు
పోటీలను ప్రారంభించిన ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి