
ఎంపీడీఓ కార్యాలయానికి తాళం
అమరచింత: ఏళ్ల తరబడి భవనం అద్దె ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు.. బకాయిలు చెల్లించే వరకు తాళం తెరవనంటూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి యాజమాని మహంకాళి సురేందర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సురేందర్ ఇంటిని ప్రతి నెల అద్దె రూ.10 వేలకు తీసుకొని ఎంపీడీఓ కార్యాలయం కొనసాగిస్తున్నారు. గతంలో బకాయి ఉన్న అద్దె మొత్తానికి రూ.3 లక్షల చెక్కును ఎంపీడీఓ అందించారు. ఎస్టీఓకు పంపినా డబ్బులు మాత్రం నేటికీ చేతికందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బకాయిలతో పాటు ప్రస్తుతం చెల్లించాల్సిన 5 నెలల అద్దె ఇచ్చేవరకు కార్యాలయానికి వేసిన తాళం తీయనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఎంపీడీఓ చెన్నమ్మతో సహా సిబ్బంది కార్యాలయం బయటే ఉండిపోయారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మంత్రి వాకిటి శ్రీహరికి విన్నవించగా వారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల గదుల్లోకి మార్చేందుకు సిద్ధమై సామగ్రి, రికార్డులను తరలించారు. మంగళవారం నుంచి అక్కడే కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఎంపీడీఓ వివరించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదుల్లోకి ఎంపీడీఓ కార్యాలయం మార్చాలని గతంలో కలెక్టర్ సూచించడంతో అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టారు.
● అద్దె చెల్లించనందుకు తెరవని యజమాని
● ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉర్దూ మీడియం పాఠశాలలోకి మార్పు

ఎంపీడీఓ కార్యాలయానికి తాళం