
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్: జోగుళాంబ, బాలబహ్వ్రేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేద్దామని ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం ఆలయంలో జరిగిన ధర్మకర్తల కార్యవర్గ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆలయాల ప్రాంగణంలో సీసీ రహదారుల పనులు పునః ప్రారంభించాలని, గోశాలలో ఆవుల సంఖ్య పెరగడం.. సిబ్బంది కొరతతో నిర్వహణ భారంగా మారిందని.. కొన్నింటిని ఇతర గోశాలలకు విక్రయించడం లేదా తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వివిధ టెండర్ల బకాయిలు త్వరగా వసూలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. వీటితోపాటు ఆదాయ వ్యయాలు, వెండి, బంగారు ఆభరణాలు, ఆలయ భూముల వివరాలను పరిశీలించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు అలంపూర్ ఆలయాల అభివృద్ధి హైలేవల్ కమిటీ సమావేశం ఉంటుందని ఈఓ పురేందర్కుమార్ చెప్పారు. సమావేశం ప్రసాద్ స్కీం భవనంలో కొనసాగనుండగా.. దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కలెక్టర్ హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షలో చర్చించారు. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు నాగ శిరోమణి, గోపాల్, జగదీశ్వర్గౌడ్, అడ్డాకుల వెంకటేశ్వర్లు, విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, జయరాముడు తదితరులు పాల్గొన్నారు.