
దుందుభిలో అక్రమ దందా!
నిబంధనలు అతిక్రమించి ఇసుక తరలింపు
జడ్చర్ల: మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు దుందుభి వాగులో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. రోజు వందలాది టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతుండగా.. ఇసుకాసురులకు అధికారులు, పోలీసులు వంత పాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) వే బిల్లులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. మిగతా పర్యవేక్షణ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా.. రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులు జాడ లేకుండా పోయారు. ఆయా శాఖల నుంచి కూడా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ మచ్చుకై నా లేదు. ఇచ్చిన అనుమతుల మేరకే తవ్వకాలు చేపడుతున్నారా.. బఫర్ జోన్లోకి వచ్చారా అన్న విచారణ చేయని దుస్థితి నెలకొంది.
నిబంధనలు గాలికి..
కొత్తపల్లి ఇసుక క్వారీలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం 2.5 మీటర్లు తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా.. సుమారు 9 మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్నా అడిగే వారు కరువయ్యారు. ఇక సామర్థ్యానికి మించి ఇసుకను టిప్పర్లలో తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరు. 10 టైర్ల లారీలో 12 క్యూబిక్ మీటర్లు (19.5 టన్నులు), 12 టైర్ల లారీలో 16 క్యూ.మీ (26 టన్నులు) మాత్రమే తరలించాల్సి ఉండగా అంతకుమించి లారీలపై చెక్కలు అడ్డుపెట్టి తరలిస్తున్నారు. టీజీఎండీసీ జారీ చేసే వేబిల్లులో 19.5 టన్నులని పేర్కొంటున్నా.. అధికంగా తరలిస్తున్నారు. అంతేగాక జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రమే ఇసుకను రవాణా చేయాల్సి ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర సుదూర ప్రాంతాలకు తరలించి హద్దులు దాటి సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక తరలించాల్సి ఉన్నా.. అందుకు విరుద్ధంగా రేయింబవళ్లు తరలిస్తున్నారు. ప్రతి వాహనాన్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇసుకను లారీలో నింపడానికి సుమారు రూ.9 వేలు వసూలు చేస్తుండగా.. దూరభారాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పైగా విక్రయిస్తున్నారు.
పట్టించుకోని రవాణాశాఖ..
అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీలను రవాణాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నా ఎక్కడకూడా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్..
ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని, రెవెన్యూశాఖ అధికారులు నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశించినా.. ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
హద్దుల నిర్ధారణ వరకే మా బాధ్యత..
కొత్తపల్లి క్వారీకి సంబంధించి పట్టా భూముల హద్దుల నిర్ధారణ చేశామని, తదుపరి బాధ్యత టీజీఎండీసీ అధికారులదేనని తహసీల్దార్ రాజు తెలిపారు. హద్దుల లోపలే తవ్వకాలు చేస్తున్నారని, నిబంధనలు అతిక్రమిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేసి చర్యలు చేపడుతామని వివరించారు. టీజీఎండీసీ అధికారిని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
జాడలేని అధికారులు..
ఇసుక క్వారీ పర్యవేక్షణను సంబంధిత అధికారులు గాలికొదిలేయడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతికి పాల్పడి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
9 మీటర్ల మేర తవ్వకాలు..
పట్టించుకోని అధికారులు
జాడలేని టీజీఎండీసీ అధికారులు
కొత్తపల్లి క్వారీలో ఇదీ పరిస్థితి

దుందుభిలో అక్రమ దందా!