
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారని.. ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్య, రాత పుస్తకాలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందుతుందని.. బడిబాట ద్వారా బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో వలంటీర్లను నియమించాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరిగినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, మండల విద్యాధికారి కృష్ణయ్య, నోడల్ అధికారి కుర్మయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వివేకానంద, తపస్ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు దేవన్న, శివ నారాయణ, లక్ష్మయ్య, రాములు, అరవింద్రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కిరణ్కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.