ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌ పాలమూరు | - | Sakshi
Sakshi News home page

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌ పాలమూరు

Jun 7 2025 12:22 AM | Updated on Jun 7 2025 12:22 AM

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌ పాలమూరు

ఇంట్రా డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌ పాలమూరు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: అండర్‌–19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌ చాంపియన్‌గా మహబూబ్‌నగర్‌ జట్టు నిలిచింది. లీగ్‌లో మొదటి నుంచి మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్‌నగర్‌ జట్టు.. వరుసగా ఐదు మ్యాచుల్లో విజయాలు సాధించి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌షిప్‌ కై వసం చేసుకుంది. జిల్లా కేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్‌ మైదానంలో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 71 పరుగుల తేడాతో జడ్చర్ల జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. జట్టులో కనిష్క్‌ ఆలౌ రౌండ్‌ ప్రతిభ కనబరిచాడు. 84 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఇతర బ్యాట్స్‌మన్లు యువన్‌ ముద్దనూరి 43, మనోజ్‌యాదవ్‌ 39, ఎండీ సోను 38, అబ్దుల్‌ రాఫే 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జడ్చర్ల జట్టు 41.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులో సంజయ్‌ 91 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు, కేతన్‌కుమార్‌ 35 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు అంకిత్‌రాయ్‌ 10 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 3, అభినవ్‌ 2, నవీన్‌కుమార్‌, ప్రణయ్‌, యువన్‌ చెరో వికెట్‌ తీశారు.

జిల్లా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆడాలి..

జిల్లా క్రికెటర్లు ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్‌లో రంజీ, భారత జట్టులో ఆడాలని ఎన్‌ఆర్‌ఐ, సీనియర్‌ క్రీడాకారుడు కేడం శ్రీనివాస్‌ అన్నారు. అండర్‌–19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌ చాంపియన్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌ జట్టును ఆయన అభినందించి మాట్లాడారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. క్రమశిక్షణ, పట్టుదలతో ఆడితే మెరుగైన విజయాలు సాధించవచ్చని అన్నారు. క్రికెట్‌లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఆరు జట్లతో అండర్‌–19 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి లీగ్‌ మ్యాచ్‌లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శన చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండీ మన్నాన్‌, సీనియర్‌ క్రీడాకారుడు మహేష్‌ పాల్గొన్నారు.

లీగ్‌లో ఐదు విజయాలు.. 15 పాయింట్లతో అగ్రస్థానం

చివరి మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో జడ్చర్లపై గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement