
పాముకాటుతో మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సాతాపూర్కు చెందిన బద్దుల సాలమ్మ (40) శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వాకిలిని ఊడుస్తున్న క్రమంలో పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. మృతురాలికి భర్త చిన్నయ్య, ఇద్దరు కూతుళ్లు శిరీష, కృష్ణవేణి ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సతీష్ తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ధన్వాడ: మండలంలోని చర్లపల్లికి చెందిన కరుణాకర్రెడ్డి (41) శుక్రవారం విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి కథనం మేరకు.. పొలం వద్ద బోరుమోటార్ కేబుల్ వైరు తెగడంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య వనజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్యహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కొండేరులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొండేరుకు చెందిన వడ్డె లక్ష్మన్న (32) మేసీ్త్ర పని చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగించే వాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతడు.. ఇంట్లో తరచుగా గొడవ పడుతుండటంతో ఇటీవల తన భార్య శివమ్మ పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన లక్ష్మన్న.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వంటగ్యాస్ లీకై ఐదుగురికి గాయాలు
గట్టు: మండలంలోని ఆలూరులో వంటగ్యాస్ లీకై ఐదుగురు గాయపడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఆలూరుకు చెందిన పూలకుంట నర్సింహులు అలియాస్ దుబ్బన్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో బుధవారం మరో సిలిండర్ను అమర్చేందుకు ఇంటి పక్కనున్న వెంకటేశ్ పిలిచారు. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను అమర్చుతున్న క్రమంలో గ్యాస్ లీక్ కావడంతో పక్కనే ఉన్న కట్టెల పొయ్యిలోని మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఇంట్లోనే ఉన్న వెంకటేశ్తో పాటు దుబ్బన్న, అతడి భార్య జయమ్మ, కోడలు మహేశ్వరి, మూడేళ్ల బాలుడు అభికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

పాముకాటుతో మహిళ మృతి