
24.728 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
ధరూరు/దోమలపెంట/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం 10వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం 9,446 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి 11,328 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా.. 67 క్యూసెక్కులు ఆవిరి అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.261 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ, దిగువలోని 6 యూనిట్ల ద్వారా 24.728 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.
శ్రీశైలానికి 9,446 క్యూసెక్కులు
జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ గురువారం 9,446 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 835.5 అడుగుల వద్ద 55.7729 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 867 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 0.842 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి 1,856 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 0.906 మి. యూనిట్లు ఉత్పత్తి చేసి 1,875 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేశారు.