
నిరసనల పర్వం..
● ఉమామహేశ్వర రిజర్వాయర్ భూసేకరణకు సర్వే పనులను అడ్డుకున్న రైతులు
● పోలీసుల బందోబస్తు మధ్య సర్వే నిర్వహణ
● నోటీసులు లేకుండా భూసేకరణపై
రైతుల ఆగ్రహం
● ప్రాజెక్ట్ సర్వే దశలోనే నిర్వాసితుల నుంచి నిరసనలు
● ఉమామహేశ్వర ప్రాజెక్ట్ పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతల పనులకు మార్గం సుగమం
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో చేపట్టనున్న ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రారంభ దశలోనే నిర్వాసిత రైతుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. గురువారం ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టేందుకు వెళ్లిన అధికారులను బల్మూరు మండలం అనంతవరం రైతులు అడ్డుకున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా భూముల్లో సర్వే పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ అధికారులు సర్వే పనులు నిర్వహించారు. ఇప్పటికే ప్రాజెక్ట్ భూసేకరణ కోసం గ్రామంలో అధికారులు గ్రామసభను నిర్వహించగా, నిర్వాసిత రైతులు సగానికి పైగా సమావేశానికి గైర్హాజరయ్యారు. తాజాగా ప్రాజెక్ట్ సర్వే పనుల అడ్డంగితకు ప్రయత్నించడంతో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
మూడు మండలాలు.. 50 వేల ఎకరాలు
అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూరు, లింగాల, అచ్చంపేట మండలాల్లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి ఒక స్లూయిస్ నిర్మించి దీని ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తూ బల్మూర్ వరకు 22 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ తవ్వాల్సి ఉంది. బల్మూరు వద్ద పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ నిర్మించనున్న రిజర్వాయర్లోని నీటిని ఎత్తి పోస్తారు. బల్మూరు, అనంతవరం, మైలారం గ్రామాల మధ్య నిర్మించనున్న రిజర్వాయర్ నుంచి మెయిన్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నెట్వర్క్ ద్వారా మూడు మండలాల రైతులకు సాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న రైతులు తమకు జీవనోపాధి కోసం మరో చోట భూమికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రస్తుత విలువ ప్రకారం ఎకరాకు కనీసం రూ.30 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. భూసేకరణకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లో పనులు చేపడితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతలకు అవకాశం..
ఉమామహేశ్వర రిజర్వాయర్ నుంచి అనుసంధానంగా ప్రభుత్వం చెన్నకేశవ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బల్మూరులో నిర్మించనున్న రిజర్వాయర్ నుంచి స్లూయిస్ ఏర్పాటుచేసి కెనాల్ ద్వారా చంద్రవాగుకు నీటిని తరలిస్తారు. వాగు ద్వారా నీటి సరఫరాతో చంద్రసాగర్ చెరువును నింపుతారు. అక్కడ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుచేసి మన్ననూర్ వద్ద నిర్మించే 1.5 టీఎంసీ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ను నీటితో నింపుతారు. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా అప్పార్ ప్లాట్లోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. అయితే ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, రిజర్వాయర్ పనులు పూర్తయితేనే చెన్నకేశవ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడనున్నాయి.

నిరసనల పర్వం..