
మొదటి రోజు ఒకే దరఖాస్తు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు పెరగడంతో పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వీటికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో అతికించారు. ప్రజల నుంచి ఏమైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11వ తేదీ వరకు స్వీకరించనున్న విషయం విదితమే. అయితే మొదటిరోజు గురువారం ఒకే దరఖాస్తు వచ్చింది. పాత వార్డు నం.28 పరిధిలోని కుమ్మరివాడి వీధిని ప్రతిపాదిత డివిజన్ నం.40లోనే ఉంచాలని కొత్తగా మదీనా మసీదు ప్రాంతం (డివిజన్ నం.41)లో కలపవద్దని మాజీ కౌన్సిలర్ ఎస్.పద్మ విన్నవించారు. అలాగే గణేష్నగర్, వల్లభ్నగర్లోని కొంత భాగాన్ని ప్రతిపాదిత డివిజన్ నం.40లో ఉంచవద్దన్నారు. గతంలో ఉన్న వీధులనే యథావిధిగా కొనసాగించాలని అందులో కోరారు. మరోవైపు ఆయా డివిజన్లకు సంబంధించిన నక్షాలు, ఓటరు జాబితాలను కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు వార్డు ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏయే డివిజన్ పరిధిలో ఏ ఓటరు ఉంటారో గతంలో నమోదు చేసుకున్న వారి వివరాలను సరిచూస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాతకాలం ఆహార పద్ధతులతో ఆరోగ్యం
పాలమూరు: మానవ శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి చిరుధాన్యాలు, కలి, చింతకాయ పచ్చడి వంటి పాతకాలం ఆహార పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యమని పాలమూరు మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రమేశ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో గురువారం బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీడీ ఆన్గట్ మైక్రోబయోమ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేగులు, జీర్ణాశయ వ్యవస్థలో సూక్ష్మజీవులు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయనే విషయాలను వివరించారు. కార్యక్రమంలో నారాయణపేట మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.రాంకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్, వైద్యులు లత, శశి, శిల్పారెడ్డి, యశ్వంత్రెడ్డి, అవినాష్రెడ్డి, సందీప్, కిరణ్మయి, రేణుక పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడమే లక్ష్యం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల కార్యాచరణతో పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ వలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు, మెప్మా సిబ్బంది సుమారు 450 మందితో కలిసి రాయచూర్ మెయిన్ రోడ్డులోని పాత ఆర్టీఏ కార్యాలయం నుంచి బండమీదిపల్లి శివారులోని శిశుమందిర్ స్కూల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఈ పాఠశాల ఆవరణలో అందరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ 8వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజీవ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, వాణికుమారి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు ఒకే దరఖాస్తు