
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య శాఖ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని రాష్ట్ర, జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి.. నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎదిర క్రాస్రోడ్డు, పాలకొండ బైపాస్, పిస్తాహౌస్ క్రాస్రోడ్లపై నిర్వహణ నిధులతో ఆగస్టులోగా రంబుల్ స్ట్రిప్, సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్హెచ్–167 బండమీదిపల్లి, ధర్నాపూర్, ఓబ్లాయిపల్లి, మన్యంకొండ వద్ద వారం రోజుల్లోగా, ఎన్హెచ్–44 బాలానగర్ క్రాస్రోడ్డు, రాజాపూర్ వద్ద రంబుల్ స్ట్రిప్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముదిరెడ్డిపల్లి వద్ద సర్వీస్ రోడ్డు, లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలేపల్లి సెజ్ వద్ద రంబుల్ స్ట్రిప్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జిల్లాలో 447 స్కూల్ బస్సులకు పిట్నెస్ సర్టిఫికెట్లు లేవని.. వాటిని అనుమతించవద్దని రవాణా, పోలీస్శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు ఉన్నారు.