తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా చేస్తాం

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా చేస్తాం

తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా చేస్తాం

రాష్ట్రంలో ఫిఫా సదరన్‌ అకాడమీ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా తయారు చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి కల అని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి వేస్తున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో బుధవారం మొదటి రాష్ట్రస్థాయి అండర్‌–23 విభాగం 3 ్ఠ3 పురుషుల, మహిళా అంతర్‌ జిల్లాల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 3 ్ఠ3 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ చాలెంజర్‌ పోటీలు నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడని, క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.360 కోట్లు, ఈ ఏడాది అధికంగా రూ.460 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి, అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో క్రీడల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత సంతోష్‌ట్రోఫీతో పాటు సబ్‌ జూనియర్‌ హాకీ, ఇటీవల రోయింగ్‌ పోటీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ మ్యాచ్‌లు నిర్వహించడానికి డబ్ల్యూటీఓతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఫిఫాతో కలిసి గచ్చిబౌలిలో సదరన్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

మహబూబ్‌నగర్‌ జట్ల

శుభారంభం

ఈ టోర్నమెంట్‌లో 18 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు మ్యాచుల్లో మహబూబ్‌నగర్‌ పురుష, మహిళా జట్లు శుభారంభం చేశాయి. మహబూబ్‌నగర్‌ పురుషులు 11–1 పాయింట్ల తేడాతో కరీంనగర్‌పై, 13–12 తేడాతో ఖమ్మంపై, జిల్లా మహిళా జట్టు 11–8 పాయింట్ల తేడాతో ఖమ్మంపై, 11–1 తేడాతో కరీంనగర్‌పై విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇతర పురుషుల విభాగం మ్యాచుల్లో హైదరాబాద్‌ 21–10 తో జయశంకర్‌ భూపాలపల్లిపై, రంగారెడ్డి 22–6 తేడాతో మెదక్‌పై, హైదరాబాద్‌ 18–11 తేడాతో మెదక్‌పై, హన్మకొండ 16–14తో మహబుబాబాద్‌పై, హైదరాబాద్‌ 21–12తో నిజామాబాద్‌పై, ఖమ్మం 16–8తో గద్వాలపై, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 21–8తో నిజామాబాద్‌పై, నల్లగొండ 18–8తో జగిత్యాలపై, రంగారెడ్డి 16–9తో మహబూబ్‌నగర్‌పై, హన్మకొండ 17–9తో కామారెడ్డిపై గెలుపొందాయి. మహిళా విభాగం మ్యాచుల్లో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 11–10 తో మహబూబ్‌నగర్‌పై, ఖమ్మం 15–2తో కరీంనగర్‌పై, హైదరాబాద్‌ 2–0 తేడాతో జయశంకర్‌ భూపాలపల్లిపై, హైదరాబాద్‌ 21–8తో నిజామాబాద్‌పై విజయం సాధించాయి.

రూ.16 కోట్లతో క్రీడాభివృద్ధి

హబూబ్‌నగర్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం రూ.16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు. ఇండోర్‌ స్టేడియంలో ఏసీ సౌకర్యం, ఇతర మౌలిక సౌకర్యాలు, సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చేనెలలో ఫుట్‌బాల్‌ మైదానాలను పరిశీలించేందుకు స్పెయిన్‌కు వెళుతున్నట్లు తెలిపారు. నైపుణ్యం గల కోచ్‌లతో మెరుగైన క్రీడాశిక్షణ అందజేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉండాలన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిచేవారు జాతీయస్థాయి ఎంపికవుతారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృద్వీశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌ బిన్‌ అహ్మద్‌ జాకీర్‌, నసరుల్లా హైదర్‌, చీఫ్‌ ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, సుబాన్‌జీ, మీర్‌ఖాలెద్‌ అలీ, ఎండి.ఇలియాజ్‌, ఫారుఖ్‌ ముకర్రం, బాల్‌రాజు, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల

సలహాదారుడు ఏపీ జితేందర్‌రెడ్డి

అట్టహాసంగా రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement