
నగదు ఇప్పించాలని ఎస్పీకి ఫిర్యాదు
నాగర్కర్నూల్ క్రైం: మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి తమకు నగదు ఇప్పించాలని పలువురు రైతులు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్కు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి నంది వడ్డెమాన్, నల్లవెల్లి, ఖానాపూర్ గ్రామాల్లోని పలువురు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేశాడు. అయితే మూడు నెలలు అయినా నగదు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాదాపు 60 మంది రైతులకు రూ. కోటి నగదు ఇవ్వాలని బాధితులు తెలిపారు.