
రూ.లక్ష చోరీ.. కేసు నమోదు
మక్తల్: రూ.లక్ష చోరీకి పాల్పడిన ఘటన మక్తల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మాగనూర్ మండలం మందిపల్లికి చెందిన కుర్వనాగప్ప బ్యాంకులో ఉన్న నగదు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో నారాయణపేట క్రాసింగ్ దగ్గర ఉన్న ఎచ్డీఎఫ్ బ్యాంకు ఎదరుగా ఉన్న ఎస్ఆర్ఎస్ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లాడు. భోజనం చేసి చేతులు కడుక్కొని వచ్చే లోగా నగదు సంచి కనిపించలేదు. బాధితుడు డబ్బులు చోరీకి గురైనట్లు గ్రహించి వెంటనే మక్తల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి కేసు నమోదు చేసుకొని ఘటనా స్థలంలోని సీసీ పుటేజీను పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.
బైక్ను ఢీ కొట్టిన లారీ.. యువకుడి మృతి
కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్ర గ్రామ సమీపంలో లారీ బైక్ను ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న కొప్పుల చరణ్ కుమార్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. చరణ్ కుమార్ తన ద్విచక్రవాహనంపై పని నిమిత్తం జూపల్లి నుంచి కల్వకుర్తి వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వెళ్తున్న లారీ తాండ్ర గ్రామ సమీపంలో ఢీకొట్టడంతో చరణ్ తలకు గాయమై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలా న్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి నెల క్రితం గుండెపోటుతో మరణించిందని ప్రస్తు తం కుమారుడు కూడా మృతి చెందడంతో జూపల్లి గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
మహిళ దుర్మరణం
గద్వాల క్రైం: రెండు బైక్లు ఎదురెదుగా ఢీకొడంతో బుధవారం సాయంత్రం ఓ మహిళ మృతి చెందింది. రూరల్ ఏఎస్ఐ వెంకటేశ్వరెడ్డి కథనం మేరకు.. మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కుర్వ రంగమ్మ(60) గద్వాల మండలంలోని పుడూరు గ్రామానికి తన కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో తెలిసిన వ్యక్తి బైక్పై వెళ్తుంది. గోపాల్దిన్నె గ్రామానికి చెందిన ఆనంద్ బైక్పై అతి వేగంగా వస్తూ పూడూరు గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రంగమ్మకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై మృతురాలి కుమారుడు సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.