
వైద్యుడి నిర్లక్ష్యం: బాలింత మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రసవం అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలింత మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు.. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం గ్రామానికి చెందిన వనజ (25) రెండో కాన్పు కోసం ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం గర్భిణికి ఆపరేషన్ చేయడంతో మగశిశుకు జన్మనిచ్చింది. ఇదే క్రమంలో మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్కు తరలించడంతో బాలింత మృతి చెందింది. బాలింత మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు బుధవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గోవర్ధన్ ధర్నా వద్దకు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ మాట్లాడుతూ మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల ధర్నా