
పశువుల కంటైనర్ పట్టివేత
అలంపూర్: పశువులను అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. అతి క్రూరంగా పశువులను తరలిస్తుండటంతో కంటైనర్లోనే మూడు కోడెదూడలు, ఒక ఆవు మృత్యువాత పడ్డాయి. ఉండవెల్లి ఎస్ఐ మహేష్ వివరాల మేరకు.. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్ప్లాజా వద్ద పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చెక్పోస్టు వద్ద పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ కంటైనర్లో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఎండీ ఖలీల్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా కంటైనర్లో 48 కోడెదూడలు, 31 ఆవులు తరలిస్తుండగా.. పట్టుకొని గోశాలకు తరలించారు. కాగా, కంటైనర్లో పశువులు కదలకుండా గట్టిగా కట్టివేయడం.. నీరు, ఆహారం లేకుండా క్రూరంగా తరలిస్తుండటంతో అందులోనే మూడు కోడె దూడలు, ఒక ఆవు మృతిచెందాయి. పట్టుబడిన పశువుల విలువ రూ. 6,75,000 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తున్న ఎండీ ఖలీల్, కంటైనర్ డ్రైవర్ అబ్దుల్ అజీజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.