
నిక్కచ్చిగా భూ సర్వే చేపట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): భూ భారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ల మొదటి విడత శిక్షణలో పాల్గొన్న లైసెన్స్డు సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో లైసెన్స్డు సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం అమలుకు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది లైసెన్స్డు సర్వేయర్లను నియమించారన్నారు. ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్స్డు సర్వేయర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 132 మంది లైసెన్స్డు సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజులపాటు థియరీ, ప్రాక్టికల్గా రిటైర్డు సర్వేయర్లు శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైన వారినే లైసెన్స్డు సర్వేయర్లుగా నియమిస్తామన్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేసేప్పుడు భూ సర్వే తప్పనిసరి అన్నారు. ప్రభుత్వ సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో భూ సర్వేకు చాలా సమయం పడుతుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు పరిష్కారం కోసం భూ సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. లైసెన్స్డు సర్వేయర్లు చేసిన భూ సర్వేను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి.. మ్యాప్ రూపొందిస్తారన్నారు. లైసెన్స్డు సర్వేయర్లుగా నియామకమైన వారు భూ సర్వే కచ్చితంగా నిర్వహించి వివాదాలకు తావు లేకుండా నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ పర్వతాలు, రిటైర్డ్ సర్వేర్లు కొండన్న, బషీర్, నాగభూషణం, శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్రావు తదితరులు పాల్గొన్నారు.