
ఆరోగ్యశ్రీ.. బకాయిల అనారోగ్యం
పాలమూరు: ఆరోగ్య శ్రీ ద్వారా అందుతున్న చికిత్సలకు, సర్జరీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రూ.కోట్లలో బకాయిలు ఉండడం వల్ల జిల్లా జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కుంటుబడుతోంది. ఆస్పత్రి నిర్వహణ కోసం ఆరోగ్య శ్రీ ద్వారా వచ్చే బడ్జెట్ను వినియోగిస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా పెండింగ్లో ఉండటం వల్ల చిన్నపాటి మరమ్మతులతో పాటు పరికరాలు, ఇతర అవసరాలకు నిధుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రి సీటీ స్కాన్ ద్వారా వచ్చే డబ్బులను చిన్నపాటి ఖర్చులకు వాడుకుంటున్నారు. గతేడాది నుంచి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ కింద కేసుల గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం రూ.40లక్షలు పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. కాగా.. రెండేళ్లుగా జనరల్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వివిధ విభాగాల్లో చేసిన శస్త్ర చికిత్సలకు సంబంధించి ఇంకా రూ.2.69 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.
● ఈ ఏడాది ఉగాది నాటికి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ సేవలు ప్రారంభం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అప్పట్లో ప్రకటించారు. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటుపై కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటుకై కనీసం భవనం పరిశీలన కానీ, ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి జిల్లాలో ఉన్న పేద రోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఎంఆర్ఐ స్కాన్ అవసరం అయిన రోగులు బయటకు వెళ్లి ప్రైవేట్ సెంటర్లలో రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వెచ్చించి స్కానింగ్ చేసుకుంటున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులు గాయాలతో బయటకు వెళ్లి స్కానింగ్ చేసుకొని రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
జనరల్ ఆస్పత్రికి ఆరోగ్య శ్రీ ద్వారా రావాల్సిన డబ్బుల విషయంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అతి త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నాం. ఇతర బడ్జెట్, ప్రత్యేక నిధులను ఆస్పత్రి నిర్వహణ కోసం వెచ్చిస్తున్నాం. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్,
ఆస్పత్రి సూపరింటెండెంట్
జనరల్ ఆస్పత్రిలో రూ.2.69కోట్ల బిల్లులు పెండింగ్
రెండేళ్లుగా భారీగా పెరిగిన కేసులు
జాడేలేని ఎంఆర్ఐ.. రోగులకు ఇబ్బందులు

ఆరోగ్యశ్రీ.. బకాయిల అనారోగ్యం

ఆరోగ్యశ్రీ.. బకాయిల అనారోగ్యం