
దేశంలోనే రోల్ మోడల్గా భూభారతి
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్మోడల్గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు.
ప్రజల వద్దకే అధికారులు..
ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, మంద మకరంద్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ బేన్షాలం, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూతన అధ్యాయానికి శ్రీకారం
రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతూ భూ భారతి పోర్టల్ను ఈ నెల 14న ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసిందని, భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు.
ఒక్క రూపాయి తీసుకోకుండానేభూ సమస్యలు పరిష్కరిస్తాం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సు ప్రారంభం