అట్టడుగున నాలుగు జిల్లాలు | - | Sakshi
Sakshi News home page

అట్టడుగున నాలుగు జిల్లాలు

Mar 21 2025 12:52 AM | Updated on Mar 21 2025 12:50 AM

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్‌ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.

● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్‌డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్‌కర్నూల్‌ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్‌డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్‌నగర్‌ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్‌కర్నూల్‌ 20వ స్థానంలో ఉన్నాయి.

● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్‌నగర్‌లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్‌ విద్యుత్‌ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్‌కర్నూల్‌ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి.

● రాష్ట్రంలోనే సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్‌, 66 కమర్షియల్‌, 867 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్‌ మోడల్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ప్లాస్టిక్‌ ఫ్రీగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌..

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా కొనసాగుతోంది. వన్యప్రాణులు, అటవీప్రాంత సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం వరకూ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిరోధించగలిగారు. శ్రీశైలం–హైదరాబాద్‌ రహదారి వెంబడి సేకరించిన మొత్తం 34 వేల కేజీల ప్లాస్టిక్‌ను తుక్కుగూడలో రీసైక్లింగ్‌ ప్రాసెస్‌ను నిర్వహించారు. అలాగే 16 మంది స్థానిక చెంచు మహిళల ఆధ్వర్యంలో పర్యావరణ హిత బ్యాగ్‌లు, ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ

మహబూబ్‌నగర్‌ జిల్లా కాస్త మెరుగు

పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు

సోలార్‌ మోడల్‌ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి

తెలంగాణ సోషల్‌ ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ 2025లో వెల్లడి

అట్టడుగున నాలుగు జిల్లాలు1
1/4

అట్టడుగున నాలుగు జిల్లాలు

అట్టడుగున నాలుగు జిల్లాలు2
2/4

అట్టడుగున నాలుగు జిల్లాలు

అట్టడుగున నాలుగు జిల్లాలు3
3/4

అట్టడుగున నాలుగు జిల్లాలు

అట్టడుగున నాలుగు జిల్లాలు4
4/4

అట్టడుగున నాలుగు జిల్లాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement