నయీంనగర్ : హనుమకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేడ్కర్ భవన్ సమీపంలో నిర్మించిన ఫ్లాట్లకు ఆదివారం ‘కుడా’ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. కుడా వైస్ చైర్పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమక్షంలో నిర్వహించిన ఈ వేలానికి బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. బాలసముద్రంలో ఉన్న కమర్షియల్ ప్లాట్లకు సంబంధించి గజానికి కనీస ధర రూ.65 వేలు నిర్ణయించారు. వేలంలో బిడ్డర్లు పోటీపడగా గరిష్టంగా రూ.97 వేల వరకు ధర పలికింది. మొత్తం 8 కమర్షియల్ ప్లాట్లలో 6 ప్లాట్లు అమ్ముడయ్యాయి. అంబేడ్కర్ భవన్ సమీపంలో కుడా ఆధీనంలో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లు వేలం వేశారు. రెండు ఫ్లాట్లను బిడ్డర్లు చదరపు అడుగుకు రూ.4,200 చొప్పున దక్కించుకున్నారు. ఈ వేలం ద్వారా కుడాకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. ప్లాట్లు, ఫ్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లకు కుడా వీసీ, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అలాట్మెంట్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాట్లు, ఫ్లాట్ల వేలానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. భవిష్యత్లో కూడా ప్రజలకు మరిన్ని నాణ్యమైన కుడా ప్లాట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, బిడ్డర్లు పాల్గొన్నారు.


