హన్మకొండ: ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఓ హోటల్లో జరిగిన రైతు, ప్రజా సంఘాల జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యం కొంటామని చెప్పి ప్రభుత్వం చేతులెత్తేసిందని, రూ.500 మద్దతు ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరం మేరకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, బోనస్, కరెంట్ సరఫరాలపై కోతలు విధించి రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిందన్నారు. బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, రాయపాటి వెంకటేశ్వర్ రావు, చకిలం రాజేశ్వర్ రావు, సాయికుమార్, గోపాల్ రావు పాల్గొన్నారు.


